Budget 2022 | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఈ దఫా వేతన జీవులకు పలు శుభవార్తలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వేతన జీవులకు గరిష్ఠ మినహాయింపులు కల్పించడంపైనే కేంద్రం దృష్టి సారించిందని అంటున్నారు.. అవేంటో ఓ లుక్కేద్దాం..
ప్రస్తుతం వేతన జీవులకు ఆదాయం పన్ను చట్టం (ఐటీ యాక్ట్)లోని 16వ సెక్షన్ కింద రూ.50 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. దీన్ని రూ.లక్షకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ అంశాన్ని చేర్చాలని శ్రామిక వర్గం డిమాండ్ చేస్తున్నది. ఒకవేళ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెరిగితే, వేతన జీవులు నేరుగా పన్ను బెనిఫిట్లు పొందొచ్చు. వేతన జీవుల నుంచే ప్రభుత్వానికి టీడీఎస్ రూపేణా పన్ను వసూలు అవుతున్నది.
కోవిడ్-19 నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం సంస్కృతి మొదలైంది. దీనివల్ల విద్యుత్, ఇంటర్నెట్ చార్జీలు, అద్దె, ఫర్నీచర్ ఖర్చులు పెరిగాయి. వర్క్ ఫ్రం హోం విధులు నిర్వర్తిస్తున్న చాలా మంది ఉద్యోగులకు మేనేజ్మెంట్లు అలవెన్స్లు ఇచ్చాయి. కనుక వర్క్ ఫ్రం హోం అలవెన్స్కు ఇన్కం టాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ అంశాలన్నీ వార్షిక బడ్జెట్లో ప్రతిపాదిస్తారని ఆశిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో జీవిత బీమా పాలసీలు వాసిలోనూ, రాశిలోనూ పెరిగాయి. ఈ నేపథ్యంలో కరోనా టాక్స్ ప్రీ కింద ఐదు నుంచి పదేండ్లపాటు ఐటీ చట్టంలోని 80సీ సెక్షన్ కింద మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ఓవరాల్గా 80సీ సెక్షన్ కింద ఐటీ మినహాయింపులు పెంచాలని అభ్యర్థిస్తున్నారు.
పన్ను చెల్లింపుదారులు తీసుకునే ఆరోగ్య బీమా లేదా బీమా పాలసీపై జీఎస్టీ చెల్లిస్తున్నారు. దీనికి మినహాయింపు ఇవ్వాలన్న ప్రజల అభ్యర్థనలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక అవిభాజ్య హిందూ కుటుంబం కింద ఐటీ చట్టంలోని 87ఏ సెక్షన్ కింద ఇస్తున్న రాయితీని పెంచాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి.