ముంబై, జూన్ 18: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వంటనూనెల ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వంటనూనెల ధరలను తగ్గిస్తున్నాయి ఆయా సంస్థలు. తాజాగా ప్రముఖ ఎఫ్ఎంసీజీ అదానీ విల్మార్ కూడా తన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ధరను రూ.10 తగ్గించింది. దీంతో లీటర్ ప్యాకెట్ ధర రూ.220 నుంచి రూ.210కి దిగొచ్చింది. దీంతోపాటు ఫార్చ్యూన్ సోయాబిన్, ఫార్చ్యూన్ కచి ఘాని(మస్టర్డ్ ఆయిల్) లీటర్ ప్యాక్ ధరను కూడా రూ.205 నుంచి రూ.195కి దించింది. నూతన స్టాక్స్ త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. రికార్డు స్థాయికి పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యుడికి ఊరట కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో కలిగే ప్రయోజనాన్ని కొనుగోలుదారుడికి బదలాయించడంలో భాగంగా ధరలు తగ్గించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ధరలు తగ్గడంతో వంటనూనెకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నదన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆయిల్సీడ్స్ తగ్గిపోవడం, తయారీ, లాజిస్టిక్ ఖర్చులు అధికమవడంతో వంటనూనెల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.