ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్జీపీటీ (ChatGPT) చాట్ బోట్ అంటే ఇప్పుడు టెక్నాలజీ రంగంలో హల్చల్. మైక్రోసాఫ్ట్ దన్నుతో పని చేస్తున్న ఓపెన్ ఏఐ (Open AI) స్టార్టప్ ఆవిష్కరించిందే చాట్జీపీటీ. ఓపెన్ ఏఐ చాట్జీపీటీ సక్సెస్ అయిన తర్వాత టెక్నాలజీ సంస్థలు, టెక్ నిపుణులు అందరూ సొంతంగా ఏఐ ఆధారిత చాట్బోట్ తయారీపై కేంద్రీకరించారు. ఆ జాబితాలో జత కలిశాడు మన పరాగ్ అగర్వాల్.. ఈయన ఎవరో కాదు.. 2022లో మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్విట్టర్’ను ఎలన్ మస్క్ టేకోవర్ చేయక ముందు ఆ సంస్థ సీఈఓగా పరాగ్ అగర్వాల్ పని చేశారు.
పరాగ్ అగర్వాల్ భారత సంతతికి చెందిన ఎన్నారై.. తాను ప్రారంభించిన ఏఐ స్టార్టప్ కోసం రూ. 249,34,28,880 (30 మిలియన్ల డాలర్లు) నిధులు సేకరించారు. తొలి దశలో చాట్జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐకి మద్దతుదారుగా ఉన్న ఖోస్లా వెంచర్స్.. ఇప్పుడు పరాగ్ అగర్వాల్ ఇన్షియేటివ్కు దన్నుగా నిలిచింది. దీంతోపాటు మరో రెండు ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలు ‘ఇండెక్స్ వెంచర్స్’, ‘ఫస్ట్ రౌండ్ క్యాపిటల్’ కూడా పరాగ్ అగర్వాల్ స్టార్టప్ కంపెనీలో చేతులు కలిపాయి. అయితే, పరాగ్ అగర్వాల్ తన వెంచర్ పేరు వెల్లడించలేదు. చాట్జీపీటీ డెవలప్ చేసిన.. `సాఫ్ట్వేర్ ఫర్ డెవలపర్స్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్’ తరహాలోనే పరాగ్ అగర్వాల్ ఏఐ వెంచర్ పేరు ఖరారు చేస్తారని తెలుస్తున్నది.
2022లో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్’ను టేకోవర్ చేసిన కొద్దికాలానికే సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్’ను ఎలన్ మస్క్ తొలగించారు. 2021 నవంబర్లో ట్విట్టర్ సీఈఓగా నియమితులయ్యారు. ట్విట్టర్ అధినేతగా ఎన్నికైన తొలి భారత్- అమెరికా సంతతి టెక్ ప్రొఫెషనల్ పరాగ్ అగర్వాల్ కావడం గమనార్హం. ఐఐటీ-బాంబే, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేసిన పరాగ్ అగర్వాల్ 2011లో ట్విట్టర్ లో చేరారు. ట్విట్టర్.. ప్రస్తుత ‘ఎక్స్’లో అప్పట్లో పని చేస్తున్న సిబ్బంది కేవలం వెయ్యి లోపే, నాటి నుంచి క్రమంగా తన స్కిల్స్ పెంచుకుంటూ 2017లో ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా నియమితులయ్యారు.