IMF India ED | కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసిన కేవీ సుబ్రమణ్యన్ను కీలక పదవి వరించింది. ఆయన్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కేంద్రం నియమించింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీచేసింది. ఆయన ప్రస్తుతం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్స్ విభాగం ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.
2022 నవంబర్ ఒకటో తేదీన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన బాధ్యతలు చేపడతారు. ఆయన పదవీ కాలం మూడేండ్లు ఉంటుంది. ప్రస్తుతం ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేస్తున్న సుర్జిత్ ఎస్ భల్లా పదవీ కాలం వచ్చే అక్టోబర్ 31తో ముగుస్తుంది. సుర్జిత్ ఎస్ భల్లా 2019 అక్టోబర్లో నియమితులయ్యారు. సుర్జిత్ ఎస్ భల్లా స్థానంలో కేవీ సుబ్రమణ్యన్ను నియమిస్తూ కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నది.
ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా 2018 డిసెంబర్ ఏడో తేదీన బాధ్యతలు స్వీకరించారు. మూడేండ్ల పదవీ కాలం ముగియడంతో గతేడాది అక్టోబర్లో కేవీ సుబ్రమణ్యం పదవి నుంచి వైదొలిగారు. రీసెర్చ్తోపాటు ప్రొఫెసర్గా కొనసాగేందుకే తాను కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారుగా వైదొలుగుతున్నట్లు అప్పట్లో చెప్పారు.