న్యూఢిల్లీ, మార్చి 29: భారత్ నుంచి విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున వెళ్లిపోతున్నాయి. దేశంలో వ్యాపార కార్యకలాపాలకు గుడ్బై చెప్తున్నాయి. ఎనిమిదేండ్లలో దాదాపు 900 ఫారిన్ కంపెనీలు ఇక్కడ తమ ‘ప్లేస్ ఆఫ్ బిజినెస్’ను మూసేసినట్టు తేలింది. 2014 నుంచి 2021 నవంబర్ వరకు భారత్ కేంద్రంగా నడుస్తున్న మొత్తం 877 విదేశీ సంస్థలు వెనక్కి వెళ్లిపోయినట్టు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ఓ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 380 నిబంధన కింద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ఢిల్లీ వివరాల ప్రకారం భారత్లో 2014 నుంచి 2021 నవంబర్ వరకు 877 విదేశీ కంపెనీలు తమ ‘ప్లేస్ ఆఫ్ బిజినెస్’ను సీజ్ చేశాయి’ అన్నారు. అయితే ఫోర్డ్, హార్లీడేవిడ్సన్ మాత్రం ఇంకా భారత్లో తమ వ్యాపార కేంద్రాలను మూసివేయలేదని స్పష్టం చేశారు. ఈ రెండు ఆటో రంగ దిగ్గజ సంస్థలు ఇప్పటికే దేశంలో వ్యాపార కార్యకలాపాలను ఆపేస్తున్నట్టు ప్రకటించింది.
ఓవైపు దేశం నుంచి విదేశీ కంపెనీలు వెనక్కిపోతుంటే.. మరోవైపు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు సైతం తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటుండటం కలవరపెడుతున్నది. ఈ ఏడాది జనవరిలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) స్టాక్ మార్కెట్ల నుంచి రూ.28,852 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరిలోనూ రూ.5,294 కోట్ల పెట్టుబడులను తిరిగి తీసేసుకున్నారు. స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ అవకతవకలపై హిండెన్బర్గ్ నివేదిక కూడా ఇందుకు దారితీసిందన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, గత ఏడా ది మొత్తంగా దేశీయ స్టాక్, డెట్ మార్కెట్ల నుంచి ఎఫ్పీఐలు 1.35 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్టు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ గణాంకాలు చెప్తున్నాయి. మునుపెన్నడూ ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వెనక్కిపోలేదు మరి.