Ford Motors | భారత్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లు గతేడాది మధ్యలో ప్రకటించింది కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్. కానీ.. ఈ అమెరికా సంస్థ యూ-టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నది. భారత్లో కార్ల ఉత్పత్తిపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ప్రణాళిక రూపొందిస్తున్నది. విద్యుత్ కార్ల తయారీపై లబ్ధి పొందడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం కోసం ఫోర్డ్ మోటార్స్ దరఖాస్తు చేసుకున్నది.
ఫోర్డ్తోపాటు మారుతిసుజుకితో సహా 20 కార్ల తయారీ సంస్థలు పీఎల్వో కోసం బారులు తీరాయి. దేశీయంగా విద్యుత్ వాహనాలను తయారు చేసి విక్రయించిన సంస్థలకు కేంద్రం.. పీఎల్ఐ కింద రూ.25,938 కోట్ల మేరకు లబ్ది చేకూరుస్తుంది.దేశీయంగా గుజరాత్లోని సనంద్ ప్లాంట్ కలిగి ఉన్న ఫోర్డ్.. ఇక్కడి నుంచే 100 శాతం ఎలక్ట్రిక్ కార్ల తయారీతోపాటు విదేశాలకు ఎగుమతి చేయాలని సంకల్పించింది.
పీఎల్ఐ కింద ఫోర్డ్ సమర్పించిన దరఖాస్తుకు కూడా కేంద్రం ఆమోదం లభించింది. తమ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందుకు ఫోర్డ్ ఇండియా ట్విట్టర్ వేదికగా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది. కేంద్రం ఆమోదం పొందిన సంస్థలు వచ్చే రెండేండ్లలో స్ట్రాటర్జీ, ప్రొడక్స్ మీద దృష్టి సారిస్తాయి. 2024 నుంచి ఐదేండ్ల పాటు పీఎల్ఐ అమలవుతుందని కేంద్రం వెల్లడించింది.
గతేడాది భారత్ మార్కెట్ నుంచి నిష్కమిస్తామని ప్రకటించినప్పుడు.. భారత్లో మార్క్యూ, ముస్తాంగ్ బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తామని ఫోర్డ్ తెలిపింది. కానీ ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ రివల్యూషన్కు సారధ్యం వహించాలని ఫోర్డ్ భావిస్తున్నది. భారత్లోని విద్యుత్ వాహనాల తయారీ ప్లాంట్లను విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉపయోగించుకోవాలని తలపోస్తున్నది.