అమృత్సర్: కరోనా సంక్షోభ సమయంలో గ్రామంలోని ఆరోగ్య కేంద్రం పరిస్థితిపై పంజాబ్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అమృత్సర్లోని మహావా ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఎలాంటి వైద్య సౌకర్యాలు లేవు. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిస్పెన్సరీ భవనం పూర్తిగా దెబ్బతిన్నదని, ఇది ఎప్పుడైనా కూలిపోతుందని గ్రామస్తురాలైన పిందర్జీత్ కౌత్ తెలిపారు. అత్యవసర కేసుల కోసం ఇక్కడ ఎలాంటి వైద్య సదుపాయాలు లేవని, నగరంలోని ఆసుపత్రికి వెళ్లాలని, ఇది తమ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని చెప్పారు.
మరోవైపు మహావా గ్రామంలో 90 శాతం మంది నిరక్షరాస్యులని, కరోనా టీకా కోసం ఆన్లైన్ నమోదు గురించి వారికి తెలియదని గ్రామానికి చెందిన కాబల్ సింగ్ తెలిపారు. కేవలం చదువుకున్న పది శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగించి టీకా కోసం తమ పేరు నమోదు చేసుకునే అవకాశం ఉన్నదని చెప్పారు. కరోనా సమయంలో అధికారులు తమ గ్రామంలో వైద్య సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన డిమాండ్ చేశారు.