Flipkart | ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత రెండేండ్లలో సుమారు రూ.41 వేల కోట్లు (500 కోట్ల డాలర్లు) తగ్గిపోయింది. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఫ్లిప్ కార్ట్ పేరెంట్ సంస్థ వాల్మార్ట్ 2022 జనవరి నుంచి 2024 ఈక్విటీ లావాదేవీల ప్రకారం ఈ గణాంకాలు వెలువడ్డాయి. 2022 జనవరిలో 40 బిలియన్ డాలర్ల విలువ గల ఫ్లిప్ కార్ట్ ఎం-క్యాప్, గత జనవరి నాటికి 35 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
కానీ, తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గలేదని ఫ్లిప్కార్ట్ చెబుతోంది. ఫిన్ టెక్ సంస్థ ఫోన్పే కంపెనీ డీ మెర్జర్ వల్లే తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిందని అంటున్నది. 2023లోనే ఫోన్ పే విడిపోయిందని ఫ్లిప్ కార్ట్ అధికార ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ఎం-క్యాప్ 38-40 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని కంపెనీ వర్గాల కథనం.
2022లో ఫ్లిప్ కార్ట్ సంస్థలో వాల్ మార్ట్ 3.2 బిలియన్ డాలర్లకు తన 8 శాతం వాటాను తగ్గించుకున్నది. నాడు ఫ్లిప్కార్ట్ విలువ 40 బిలియన్ డాలర్లు. తిరిగి 2024 జనవరిలో తన వాటాను 10 శాతం పెంచుకోవడంతో 85 శాతానికి చేరింది. ఇందుకోసం 3.5 బిలియన్ డాలర్లు ఫ్లిప్కార్ట్కు వాల్మార్ట్ చెల్లించడం వల్ల ఈ-కామర్స్ సంస్థ ఎం-క్యాప్ 35 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.