న్యూఢిల్లీ, జూన్ 30: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) గురువారం ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. 2017 జూలై 1న దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తదితర 17 పన్నులు, సుంకాలను ఏకం చేస్తూ జీఎస్టీని తీసుకొచ్చిన సంగతీ విదితమే. ప్రస్తుతం జీఎస్టీ కింద 5, 12, 18, 28 శ్లాబుల్లో ఆయా సేవలు, వస్తూత్పత్తులకు పన్నులు వేస్తున్నారు. బంగారం, నగలు, విలువైన రత్నాలపై ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధిస్తుండగా, సానబెట్టిన వజ్రాలపై 1.5 శాతం పన్నున్నది. ఇక విద్య, వైద్యానికి జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వగా, పెట్రో ఉత్పత్తులు మరికొన్నింటిని దీని పరిధిలోకి తీసుకురాలేదు. వీటిపై ఎప్పట్లాగే పాత విధానంలో పన్నులున్నాయి. లగ్జరీ ఉత్పత్తులను 28 శాతం శ్లాబులో ఉంచగా, వీటిపై అదనంగా దాదాపు ఇంతే స్థాయిలో సెస్సులనూ వేస్తున్నారు. జీఎస్టీ పన్నుల సవరణ కోసం ఓ మండలిని ఏర్పాటు చేయగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని ఈ కౌన్సిల్లో రాష్ర్టాల మంత్రులు సభ్యులుగా ఉన్నారు.