న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర ప్రభుత్వపు ద్రవ్యలోటు జూన్ త్రైమాసికం ముగిసేనాటికి రూ.3.51 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయం, ఆదాయం మధ్య వ్యత్యాసాన్ని తెలిపే ఈ లోటు 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటికే 21.2 శాతానికి చేరింది. గత ఏడాది ఇదేకాలంలో ఇది 18.2 శాతమే. 2023 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 6.4 శాతం ఉంటుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. నిరుడు ఇది 6.71 శాతం అవగా, అంతకంటే తక్కువకే లోటు అదుపు చేయాలన్న లక్ష్యంతో అంచనాల్ని కుదించారు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2022 జూన్ వరకూ కేంద్రం రెవిన్యూ వసూళ్లు రూ.5,96, 040 కోట్లు. బడ్జెట్ అంచనా మొత్తంలో ఇది 26.1 శాతం. ఏడాది క్రితం ఈ వసూళ్లు 27.7 శాతం. తాజా త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వపు మొత్తం వ్యయం రూ.9,47,911 కోట్లు. బడ్జెట్ లక్ష్యంలో ఇది 24 శాతం. నిరుడు ఇదే సమయానికి 23.6 శాతం ఉంది. ఈ పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.16,61,196 కోట్ల ద్రవ్యలోటును బడ్జెట్లో కేంద్రం నిర్దేశించుకుంది.
లోటు పెరిగితే…
ద్రవ్యలోటు పెరుగుతున్నకొద్దీ కేంద్రం ఆ మేరకు మార్కెట్లో రుణాల్ని సమీకరించాల్సి ఉంటుంది. దీంతో సహజంగానే వడ్డీ రేట్లు పెరగడం, దేశం క్రెడిట్ రేటింగ్స్ దెబ్బతినడం, రుణ సమీకరణ వ్యయం పెరగడం వంటి ప్రతికూల ప్రభావాలుంటాయి.