న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఐటీ రిటర్నులకు సంబంధించి కార్పొరేట్ సంస్థలకు శుభవార్తను అందించింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. 2022-23 అసెస్మెంట్ సంవత్సరానికిగాను ఐటీ రిటర్నుల గడువును ఈ నెల 31 నుంచి వచ్చే నెల 7 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. ఐటీ రిటర్నులకు సంబంధించి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139 యాక్ట్ ప్రకారం అసెస్మెంట్ సంవత్సరం 2022-23 ఐటీ రిటర్నుల గడవును అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు పెంచుతున్నట్లు సీబీడీటీ తన నోటిఫికేషన్లో వెల్లడించింది. మరోవైపు, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను దేశీయ కంపెనీలకు సంబంధించి ఐటీ రిటర్నులు వచ్చేనెల చివరి వరకు దాఖలు చేసుకోవచ్చును కూడా. ప్రస్తుత పండుగ సీజన్లో వ్యాపారస్తులకు ఇది శుభవార్త అని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.