Financial Changes from June | మంగళవారంతో మే నెల ముగిసింది. బుధవారం నుంచి జూన్ మొదలవుతున్నది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో కొన్ని కీలక ఆర్థిక అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ తరుణంలో సదరు మార్పుల గురించి ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇంటి రుణాలపై వడ్డీరేటు పెంపు, బంగారం ఆభరణాలపై హాల్మార్కింగ్ తదితర ముఖ్యమైన మనీ సంబంధిత మార్పులు జరుగబోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటి రుణం తీసుకున్న వారు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, వాహనాల యజమానులపై ఈ మార్పుల ప్రభావం నేరుగా తప్పనిసరిగా పడుతుంది. జూన్ నుంచి మార్పులు చోటు చేసుకోనున్న ఐదు ప్రధాన ఆర్థికాంశాలు ఇవే. అవేంటో చూద్దామా..!
దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఇంటి రుణాలపై వడ్డీరేట్ (ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్-ఈబీఎల్ఆర్) 40 బేసిక్ పాయింట్లు పెంచేసింది. దీంతో ఈబీఎల్ఆర్ 7.05 శాతానికి పెరిగింది. ఇక రెపోరేట్ లింక్డ్ లోన్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) 6.65 శాతం ప్లస్ సీఆర్పీ చెల్లించాల్సి ఉంటుంది. జూన్ ఒకటో తేదీ నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి.
బంగారం ఆభరణాలపై రెండో దశ హాల్మార్కింగ్ ప్రక్రియ జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది. తొలిదశలో 256 జిల్లాలతోపాటు 32 కొత్త జిల్లాల్లో ఈ విధానం అమల్లోకి వస్తుంది. 14 క్యారట్లు, 18, 20, 22, 23, 24 క్యారట్ల బంగారం ఆభరణాలపై తప్పనిసరిగా హాల్మార్కింగ్ చేయాల్సిందే.
జూన్ ఒకటో తేదీ నుంచి యాక్సిస్ బ్యాంకులో వివిధ ఖాతాల్లో కనీస నిల్వల నిబంధనలు మారుతున్నాయి. పల్లెలు, పట్టాణాల పరిధిలోని శాఖల్లో ఖాతాలు ప్రారంభించిన వారు రూ.15 వేల నుంచి 25 వేల వరకు నగదు నిల్వలు కొనసాగించాలి. అలాకానీ పక్షంలో రూ.లక్ష టర్మ్ డిపాజిట్ చేసి ఉంచాలి. ఇక కనీస బ్యాలెన్స్ నమోదు చేయని ఖాతాదారులపై యూజర్ చార్జీలు 7.50 శాతానికి పెరిగింది.
ప్రైవేట్ కార్ల (1000 సీసీ లోపు)పై థర్డ్ పార్టీ బీమా వార్షిక ప్రీమియం రూ.2072 (2019-20) నుంచి రూ.2,094కి పెరిగింది. 1000 సీసీ నుంచి 1500 సీసీ సామర్థ్యం గల ప్రైవేట్ కార్ల థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రూ.3,221 నుంచి రూ.3,416లకు పెంచేశారు. 1500 సీసీ సామర్థ్యం గల అతిపెద్ద ప్రైవేట్ వాహనాల థర్డ్ పార్టీ ప్రీమియం రూ.7,890 నుంచి రూ.7897కు పెరిగింది. 150సీసీ-350 సీసీ మధ్య ఇంజిన్ సామర్థ్యం గల టూ వీలర్స్ థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రూ.1,366 కాగా, 350సీసీకి పైగా సామర్థ్యం గల టూ వీలర్స్ ప్రీమియం రూ.2,804గా ఖరారు చేశారు. కొత్త కారు (1000 సీసీ సామర్థ్యం గల ఇంజిన్)పై మూడేండ్ల సింగిల్ ప్రీమియం రూ.6,521గా నిర్ణయించారు. 1500 సీసీ లోపు కార్లపై బీమా ప్రీమియం రూ.10,640 చెల్లించాల్సి ఉంటుంది.
1500సీసీకి పైగా నూతన ప్రైవేట్ వాహనంపై మూడేండ్ల బీమా ప్రీమియం రూ. 24,596 ఖరారైంది.
75 సీసీలలోపు టూ వీలర్స్పై ఐదేండ్ల సింగిల్ బీమా ప్రీమియం రూ.2901, 150సీసీ లోపు టూ వీలర్స్పై రూ.3851, 350 సీసీ లోపు ద్విచక్ర వాహనాలపై రూ.7,365గా ఖరారు చేశారు. 350సీసీ సామర్థ్యం గల టూ వీలర్స్ ఐదేండ్ల బీమా ప్రీమియం రూ.15,117గా ఖరారు చేశారు.
30కిలోవాట్ల (కేడబ్ల్యూ) సామర్థ్యం లోపు విద్యుత్ వాహనంపై మూడేండ్ల బీమా ప్రీమియం రూ.5,543, 65 కేడబ్ల్యూ కెపాసిటీ గల వెహికల్స్పై మూడేండ్ల ప్రీమియం రూ.9,044గా నిర్ణయించారు. 65కేడబ్ల్యూ కంటే ఎక్కువ సామర్థ్యం గల వాహనాలపై బీమా ప్రీమియం మూడేండ్లకు రూ.20,907 ఖరారు చేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తున్నది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)లో ఆధార్ అనుబంధ చెల్లింపుల వ్యవస్థ (ఏఈపీఎస్) కింద చార్జీలు ఖరారయ్యాయి. ఈ చార్జీలు జూన్ 15 నుంచి అమలవుతాయి. ప్రతి నెటా ఆధార్ అనుబంధ చెల్లింపుల వ్యవస్థ ద్వారా తొలి మూడుసార్లు చెల్లింపులు ఉచితం. తదుపరి ప్రతి నగదు డిపాజిట్ లేదా విత్ డ్రాయల్పై రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సిందే. మినీ స్టేట్మెంట్ కావాలంటే రూ.5తోపాటు జీఎస్టీ పే చేయాలి.