Nirmala Sitaraman | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటాల విక్రయంపై కొన్ని నిబంధనలు సడలించాలని భారతీయ రిజర్వు బ్యాంకును కేంద్ర ఆర్థిక శాఖ కోనున్నదని సమాచారం. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ప్రైవేట్ వ్యక్తులు వాటాలు కొనుగోలు చేయడానికి పరిమితులు ఉన్నాయి. ప్రైవేట్ ఇన్వెస్టర్లు పది శాతానికి మించి ఐడీబీఐ బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయరాదు. ఈ నిబంధన సడలించడానికి ఆర్బీఐ అంగీకరిస్తే.. ఐడీబీఐ బ్యాంకులో ఎంత వాటా విక్రయించాలన్న సంగతిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఖరారు చేయనున్నదని తెలుస్తున్నది.
ఈ మేరకు ఈ నెల 14 (గురువారం)న ఆర్బీఐ అధికారులతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారని సమాచారం. యాజమాన్య నియంత్రణతోపాటు బ్యాంకులో వ్యూహాత్మక వాటా విక్రయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఐడీబీఐలో కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కు 49.24 శాతం వాటా ఉన్నాయి.
గురువారం ఆర్బీఐ అధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ తర్వాతే ఐడీబీఐలో వాటాల ఉపసంహరణకు, ఇన్వెస్టర్ల నుంచి ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ)లను ఆహ్వానిస్తూ దీపం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ ద్వారా రూ.65 వేల కోట్ల నిధులు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది.