GST Collection | దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లలో కేంద్రం సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. 2021 ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో జీఎస్టీ వసూళ్లు 18 శాతం వృద్ధి చెంది రూ.1,33,026 కోట్లకు చేరుకున్నాయి. జనవరి జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే 5.6 శాతం తక్కువ. గత జనవరిలో 1,40,986 కోట్ల జీఎస్టీ వసూలైంది.
ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ వాటా రూ.24,435 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ వాటా రూ.30,779 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.67,471 కోట్లు ఉన్నాయి. ఇందులో వివిధ వస్తువుల దిగుమతిపై సుంకాలు రూ.33,837 కోట్లు ఉన్నాయి. దిగుమతి సుంకం రూ.638 కోట్లతోపాటు సెస్ రూ.10,340 కోట్లు అని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.
2021 ఫిబ్రవరితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 18 శాతం పెరిగాయి. 2020 ఫిబ్రవరితో పోలిస్తే 26 శాతానికి పైగా వృద్ధి చెందాయి. దిగుమతి వస్తువులపై రెవెన్యూ వసూళ్లు 38 శాతం వృద్ధి చెందితే, దేశీయ లావాదేవీల (దిగుమతి సేవలు)తో రెవెన్యూ వసూళ్లు 12 శాతానికి పైగా పెరిగాయి.
ఫిబ్రవరి 28 రోజులు మాత్రమే కావడంతో సాధారణంగానే జనవరితో పోలిస్తే రెవెన్యూ వసూళ్లు తక్కువగా ఉంటాయి. కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ను కట్టడి చేయడానికి వివిధ రాష్ట్రాల్లో పాక్షిక లాక్డౌన్లు, వారాంతపు, నైట్ కర్ఫ్యూలు విధించారు.