భారత్పై విదేశీ మదుపరులలో విశ్వాసం సన్నగిల్లిందా?.. కేంద్ర పాలకుల విధివిధానాలపై విసుగు చెందారా.. అందుకే పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారా?.. దశాబ్దకాలంలోనే తొలిసారి గత ఆర్థిక సంవత్సరం దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పడిపోవడం ఏం సంకేతాలనిస్తున్నది?
FDI | దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) క్షీణించాయి. పారిశ్రామిక ప్రోత్సాహక-అంతర్గత వాణిజ్య శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ల తాజా గణాంకాల ప్రకారం అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం (2022-23)16.3 శాతం పడిపోయాయి. ఈ మార్చి ఆఖరుతో ముగిసిన ఏడాది కాలంలో దేశంలోకి స్థూలంగా వచ్చిన ఎఫ్డీఐలు 71 బిలియన్ డాలర్లే. అంతకుముందు ఏడాది ఎఫ్డీఐ 84.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో గడిచిన దశాబ్దకాలంలోనే భారత్కు ఎఫ్డీఐలు తొలిసారిగా తగ్గినైట్టెంది. 2012-13 తర్వాత దేశంలోకి ఎఫ్డీఐల రాకలో పతనం కనిపించడం ఇదే కావడం గమనార్హం. ఇక అటు నికర ఎఫ్డీఐల పరంగా చూసినా 2022-23లో 28 బిలియన్ డాలర్లే. 2021-22తో చూస్తే సుమారు 27 శాతం తగ్గాయి.
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లేనా..
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దేశంలోకి ఎఫ్డీఐలు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. కరోనా విజృంభణ సమయంలో ఉద్దీపనల పేరిట చెప్పిన కాకి లెక్కలు కొంప ముంచాయంటున్నారు. లక్షల కోట్ల ఉద్దీపనల్ని ప్రకటించినా.. వాటి ప్రయోజనం మాత్రం కీలక రంగాలకు ఇప్పటికీ అందలేదని ఆర్థిక నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఉద్దీపనలపై నమ్మకంతో లాక్డౌన్ సమయంలో రిలయన్స్ జియో, ఇతర స్టార్టప్ల్లోకి విదేశీ ఫండింగ్ బాగానే జరిగిందని, అయితే అసలు విషయం బోధపడ్డాక.. ఫారిన్ ఇన్వెస్టర్లు పునరాలోచనలో పడ్డారని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే 2022-23లో ఎఫ్డీఐలు ఏకంగా దాదాపు రూ.1.2 లక్షల కోట్లదాకా తగ్గాయని చెప్పుకొస్తున్నారు.
రిస్క్లో స్టార్టప్ భారతం
స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటూ ఊదరగొట్టిన మోదీ సర్కారు.. ఆ లక్ష్యాల సాధనను మాత్రం గాలికొదిలేసింది. ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలకు క్షేత్రస్థాయిలో అందాల్సిన చేయూత ఎంతమాత్రం అందలేదనే అంటున్నారు మరి. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తుల్లో ఒకటైన తయారీ రంగానికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం అంతంతే. ఈ క్రమంలోనే ఆయా రంగాలు విదేశీ ఇన్వెస్టర్లపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. అయితే విదేశాల నుంచి పెట్టుబడులు రాక ఇప్పుడా స్టార్టప్ల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది.
ముందుచూపుతో తెలంగాణ టాప్
కేంద్ర ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలతో భారత్లోకి ఎఫ్డీఐలు తగ్గుముఖం పట్టినా.. రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపుతో తెలంగాణ మాత్రం దేశానికే ఆశాకిరణంగా నిలుస్తున్నది. 2022లో రాష్ట్రంలోని ఏరోస్పేస్, ఐటీ, డైరీ-ఫిషరీస్, ఫార్మా, బ్యాటరీల తయారీ, ఆటోమొబైల్ తదితర రంగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడమే ఇందుకు నిదర్శనం. నిరుడు రూ.20వేల కోట్లకుపైగానే పెట్టుబడులు రాగా, 70వేలకుపైగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. మరో రూ.1.11 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రకటనలు రాగా, 2025కల్లా వీటితో లక్ష ఉద్యోగాలైనా రానున్నాయి. టీఎస్-ఐపాస్, టీ-హబ్, వుయ్-హబ్ వంటి ఆకర్షణీయ ప్రాజెక్టులతోపాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్య, ప్రతిభావంతులైన యువశక్తి కలిసొస్తున్నాయి. మొత్తానికి పరిశ్రమలు, పెట్టుబడులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ, రాష్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వం.. తెలంగాణను దేశ, విదేశీ కార్పొరేట్లకు హాట్ ఫేవరేట్గా మారుస్తున్నది.
భారత్లో ఉన్న అవకాశాల దృష్ట్యా పెద్ద ఎత్తున ఎఫ్డీఐలను అందిపుచ్చుకోగలం. ముఖ్యంగా తయారీ రంగం బలోపేతంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులున్నా విదేశీ మదుపరులను ఆకట్టుకోగలం
-డీకే జోషి, క్రిసిల్ ప్రధాన ఆర్థికవేత్త