అధిక ధరలే కారణం: ఆర్సీ భార్గవ
న్యూఢిల్లీ, ఆగస్టు 2: అధిక ధరలతో కార్లకు డిమాండ్ రోజురోజుకూ పడిపోతున్నదని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారంతోపాటు ఆయా మోడళ్లలో రకాలనుబట్టి కారు ధర పెరిగిపోతున్నదని, దీంతో కొనుగోలుదారులు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇతర దేశాలతో పోల్చితే భారత్లో జీఎస్టీ ఎక్కువగా ఉన్నదన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు. 2020-21కిగాను సంస్థ వార్షిక నివేదికలో వాటాదారులనుద్దేశించి మాట్లాడుతూ రాబోయే మూడు నెలలనూ కరోనా పరిస్థితులే ప్రభావితం చేయవచ్చన్నారు. పెరుగుతున్న ఉత్పాదక వ్యయంతో ఆటో సంస్థలు ఇటీవల పలుమార్లు వాహన ధరలను పెంచిన విషయం తెలిసిందే.