న్యూఢిల్లీ, జూన్ 9: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీకాలాన్ని మరో తొమ్మిది నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీవో ప్రతిపాదన పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్న కేంద్రం..ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. దీంట్లో భాగంగా ఈ నెల చివర్లో పదవీ విరమణ చేయాల్సిన కుమార్ పదవీ కాలాన్ని మార్చి 31 వరకు పొడిగించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసుల సూచనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి బీమా కార్పొరేషన్ యాక్ట్, 1956 చట్టాన్ని కూడా సవరణలు చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఏడాదిలోనే ఎల్ఐసీలో వాటాలను విక్రయించాలని ప్రకటించారు. అలాగే డిజిన్వెస్ట్మెంట్తో రూ.1.75 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని ప్రకటించిన విషయం తెలిసిందే.