న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో గత నెలకుగాను ఎగుమతులు 2.83 శాతం తగ్గి 33.90 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఇదే నెలలో దేశీయ దిగుమతులు కూడా 4.33 శాతం తగ్గి 54.48 బిలియన్ డాలర్లకు తగ్గడం విశేషం. దీంతో వాణిజ్యలోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 20.58 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వెల్లడించింది. పెట్రోలియం ఉత్పత్తులు, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ, కెమికల్స్, వస్త్రాలు, ఇంజినీరింగ్ గూడ్స్ విభాగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకోవడంతో ఎగుమతులు నీరసించాయని పేర్కొంది. కానీ, ఎలక్ట్రానిక్స్, ఇనుప ఖనిజం, ఫార్మా రంగాలు ఆశాజనక పనితీరు కనబరిచాయి. గత నెలలో పసిడి దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 6.24 శాతం తగ్గి 3.44 బిలియన్ డాలర్లకు చేరుకోగా, చమురు దిగుమతులు మాత్రం 8.47 శాతం తగ్గి 14.93 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అలాగే సర్వీసుల ఎగుమతులు 26.93 బిలియన్ డాలర్ల నుంచి 28.69 బిలియన్ డాలర్లకు చేరాయి.
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎగుమతులు ఆశాజనకంగా ఉన్నాయి. దేశాల వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం, వడ్డీరేట్లు, అంతర్గత విషయాలు ప్రభావం చూపుతున్నాయి.
– సునీల్ బర్థ్వాల్, వాణిజ్య కార్యదర్శి