దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన సంకేతాల్లో ఒకటైన ఎగుమతులు నత్తనడకన సాగుతున్నాయి. గత నెలలోనూ పెరుగుదలకు నోచుకోలేకపోయాయి. కీలకమైన ఇంజినీరింగ్, రత్నాలు-ఆభరణాల రంగాల్లో నీరసం కనిపిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం మొదలు ఈ రెండు రంగాల ఎగుమతులు నిరాశాజనకంగానే ఉన్నాయి మరి. మొత్తానికి ఈ పరిస్థితి దేశంలోని విదేశీ మారకపు నిల్వలను ప్రభావితం చేస్తున్నది.
న్యూఢిల్లీ, మార్చి 15: దేశీయ ఎగుమతులు కోలుకోవడం లేదు. గత నెలలోనూ ప్రతికూల వృద్ధికే పరిమితమయ్యాయి. నిరుడు డిసెంబర్లో నీరసంగా, జనవరిలో సవరిస్తేగానీ కోలుకోని ఎగుమతులు.. ఫిబ్రవరిలో దిగజారాయి. గత నెల 33.88 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగినట్టు బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది. గత ఏడాది ఫిబ్రవరి ఎగుమతులతో పోల్చితే ఇది 8.8 శాతం తక్కువ కావడం గమనార్హం. మరోవైపు దేశంలోకి ఈ ఫిబ్రవరిలో జరిగిన దిగుమతులు 51.31 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నిరుడుతో చూస్తే తగ్గినా.. ఎగుమతుల కంటే ఎక్కువగా నమోదవడంతో వాణిజ్య లోటు 17.43 బిలియన్ డాలర్లుగా ఉన్నది.
వాణిజ్య లోటు 248 బిలియన్ డాలర్లకు..
ఇదిలావుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్-ఫిబ్రవరిలో దేశ ఎగుమతులు గతంతో పోల్చితే 7.5 శాతం పెరిగి 405.94 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతులు 18.82 శాతం ఎగిసి 653.47 బిలియన్ డాలర్లను తాకాయి. ఫలితంగా వాణిజ్య లోటు 247.53 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇకపోతే ఈ నెలాఖరుతో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నందున మొత్తం ఈ ఏడాది దేశ వస్తు, సేవల ఎగుమతులు 750 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ ఈ సందర్భంగా అంచనా వేశారు. అలాగే వచ్చే నెల ఏప్రిల్తో మొదలయ్యే తదుపరి ఆర్థిక సంవత్సరం (2023-24) కోసం ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించే పనిలో ఇప్పటికే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నదని చెప్పారు. అంతేగాక కొత్త ఐదేండ్ల విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ) కూడా ఈ నెలాఖర్లోనే విడుదల కావచ్చన్నారు. ప్రస్తుత విదేశీ వాణిజ్య విధానం 2015-20ది. కరోనా నేపథ్యంలో ఇదే నిరుడు మార్చి ఆఖరుదాకా కొనసాగింది. కాగా, భారత్-కెనడా మధ్య వాణిజ్య ఒప్పందంపై తదుపరి విడుత చర్చలు ఏప్రిల్లో మొదలయ్యే వీలుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ క్రిషన్ కుమార్ తెలిపారు.
రష్యా నుంచి పెరిగిన దిగుమతులు
నిరుడు ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య రష్యా నుంచి భారత్ చేసుకున్న దిగుమతులు భారీగా పెరిగాయి. గతంతో పోల్చితే సుమారు ఐదింతలు ఎగబాకడం గమనార్హం. గడిచిన 11 నెలల్లో రష్యా నుంచి 41.56 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు దేశంలోకి జరిగాయి. ఇందులో ఎక్కువగా ముడి చమురే ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) భారతీయ దిగుమతుల్లో రష్యా 18వ స్థానంలో ఉన్నది. ఆ దేశం నుంచి వచ్చిన దిగుమతుల విలువ 9.86 బిలియన్ డాలర్లే. కానీ ఇప్పుడు ఐదింతలయ్యాయి. మరోవైపు ఉక్రెయిన్కు సీఫుడ్ ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. నిరుడు ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య 1.36 మిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. ఇక గత 11 నెలల్లో జరిగిన దేశ ఎగుమతుల్లో అమెరికా వాటా 17.5 శాతంగా ఉన్నది. యూఏఈ, చైనా ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి.
బంగారం దిగుమతులు
నిరుడు ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య దేశంలోకి జరిగిన బంగారం దిగుమతుల విలువ 31.72 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఏడాది క్రితంతో పోల్చితే తగ్గుముఖం పట్టాయి. ఇదిలావుంటే గడిచిన 11 నెలల్లో దేశీయ ముడి చమురు దిగుమతులు 193.47 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతకుముందు 11 నెలల్లో 140.67 బిలియన్ డాలర్లుగానే ఉండటం గమనార్హం. దీంతో దాదాపు 53 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్ అధికంగా దిగుమతైనట్టు తేలింది. దేశీయ దిగుమతుల్లో అత్యధిక వాటా ముడి చమురుదేనన్న విషయం తెలిసిందే. అయితే క్రమేణా ఇవి పెరుగుతుండటం అటు వాణిజ్య లోటును, ఇటు కరెంట్ ఖాతా లోటును ఎగదోస్తున్నాయన్న ఆందోళన ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నది. ఇక గత 11 నెలలుగా దేశంలోకి బొగ్గు, కోక్, బ్రికెట్ల దిగుమతులూ గణనీయంగా పెరిగాయని తాజా గణాంకాల్లో స్పష్టమైంది. అంతకుముందుతో పోల్చితే 27.12 బిలియన్ డాలర్ల నుంచి 46.28 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.ఈ ఏడాది