కాచిగూడ,ఏప్రిల్ 23: పరిసరాల శుభ్రతతోనే కరోనా వైరస్ను కట్టడి చేయవచ్చని, కరోనా మహమ్మారిని వ్యక్తిగత పరిశుభ్రతతో నివారించవచ్చునని కాచిగూడ డిపో మేనేజర్ ఎన్. శ్రీనివాస్రావు అన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరోనా వైరస్ పట్ల ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతిరోజూ కాచిగూడ డిపోలోని కార్యాలయాలతో పాటు అన్ని బస్సుల హ్యాండిల్స్లను శానిటైజ్ చేస్తూ, సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయిస్తున్నారు. డిపో మేనేజర్ శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. ప్రయాణికులు కరోనా వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నగరంలోని పలు ప్రాంతల్లో తిరిగే బస్సులన్నిటినీ ప్రతిరోజూ డిపోలో శుభ్రం చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కరోనా నివారణకు కాచిగూడ ఆర్టీసీ సిబ్బందికి పలు జాగ్రత్తలను సూచించారు. సిబ్బంది కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేయవద్దని, వ్యాధి సోకిన వ్యక్తి వెంటనే దవాఖానకు వెళ్లాలని, ముఖ్యంగా ఇంటి పరసరాల శుభ్రతకు అధిక ప్రధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ డిపో సీఐ శ్రీనివాస్తో పాటు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.