Reliance-Disney | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: భారతీయ మీడియా, వినోద రంగంపై రిలయన్స్-డిస్నీ విలీనం పెద్ద ఎత్తునే ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ వయకామ్18తో వాల్ట్ డిస్నీ దేశీయ మీడియా వ్యాపార కార్యకలాపాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. ఇదే జరిగితే దేశీయ మీడియా, వినోద రంగంలో గుత్తాధిపత్యం రాజ్యమేలుతుందని, ఫలితంగా సబ్స్ర్కైబర్లకు ఇప్పటిదాకా అందుతున్న తక్కువ చార్జీల ప్రయోజనాలు క్రమేణా దూరం కాగలవని ఈ రంగ నిపుణులు అంటున్నారు. వ్యాపారులు సైతం తమ వాణిజ్య ప్రకటనల కోసం బేరాలాడే శక్తిని కోల్పోవచ్చని, దీనివల్ల ప్రకటనల వ్యయం పెరిగి వినియోగదారులపై ఆ భారం పడవచ్చని చెప్తున్నారు. రిలయన్స్-డిస్నీ దేశీయ మీడియా కార్యకలాపాల విలీనంతో రూ.70,000 కోట్ల కొత్త సంస్థ ఆవిర్భవించనున్నది.
వచ్చే ఏడాది మార్చికల్లా కావాల్సిన అనుమతులు వస్తాయని అంచనా. ఇక ఇందులో ఓటీటీ మార్కెట్ బడా వేదికలైన జియో సినిమా, డిస్నీప్లస్హాట్స్టార్లతోపాటు స్టార్ గ్రూప్నకు చెందిన అన్ని చానళ్లు, టీవీ18 ఆధ్వర్యంలోని చానళ్లు ఉండనున్నాయి. మొత్తంగా 120 చానళ్లు, 2 ఓటీటీలు, రిలయన్స్, డిస్నీలకు చెందిన 2 ఫిల్మ్ స్టూడియోలు ఒకే సంస్థ పరిధిలోకి రానున్నాయి. దీంతో మార్కెట్లో పోటీ వాతావరణం తగ్గిపోతుందని, మెజారిటీ టెలివిజన్ చానళ్లు ఒక్కరివే అయితే వారు నిర్ణయించిన ధరలకే చానళ్లను సబ్స్ర్కైబర్లు కొనుక్కోవాల్సి వస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీటిల్లో యాడ్స్ ఇవ్వాలన్నా వ్యాపారులు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని, చివరకు ఇది ఆయా ఉత్పత్తుల ధరల పెరుగుదలకు దారి తీయవచ్చన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో సన్, జీ, సోనీ ఇతర సంస్థల వాటా గణనీయంగా తగ్గుతుందని, ఇది పోటీ మార్కెట్ పరిస్థితులకు ఏమంత మంచిది కాదనీ అంటున్నారు.
భారతీయ టెలివిజన్ ప్రేక్షకుల సరదా కాలం ఇక ముగిసిపోనున్నది. అటు డిజిటల్, ఇటు సంప్రదాయ టీవీ చానళ్ల ధరలు పెరిగే వీలున్నది మరి. మెజారిటీ చానళ్లు ఒక్కరి దగ్గరే ఉండటం వల్ల వాటిలో ప్రకటనలూ ఖరీదెక్కుతాయి. అంతిమంగా ఇది ఆయా ఉత్పత్తుల వినియోగదారులపైనే భారం.
-అభ్నీశ్ రాయ్, నువమా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఈడీ
స్పోర్ట్స్ చానళ్లలో గుత్తాధిపత్యం ఆయా ప్రకటనల వ్యయాన్ని అమాంతం పెంచేయగలదు. డిస్నీ, జియోల చేతిలోనే దాదాపు 75-80 శాతం భారతీయ క్రీడా మార్కెట్ ఉంటున్నది. ఐపీఎల్, ఐసీసీ క్రికెట్ టోర్నమెంట్లు, వింబుల్డన్, ప్రో కబడీ లీగ్, బీసీసీఐ దేశవాళీ క్రికెట్ పోటీలన్నీ ప్రసారం చేసే హక్కులు రిలయన్స్-డిస్నీ చానళ్ల చేతిలోనే ఉంటున్నాయి.
-కరణ్ తౌరణి, ఎలరా క్యాపిటల్ సీనియర్ వీపీ