హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పలు కొత్త పారిశ్రామికవాడల్లో స్థలాల కేటాయింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. స్థలాల కేటాయింపు పూర్తయిన చోట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటితోపాటు ప్రత్యేక ఆహారశుద్ధి మండళ్లలో కూడా స్థలాల కేటాయింపు ప్రక్రియను చేపట్టారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వారి ప్రాజెక్టు రిపోర్ట్ ఆధారంగా టీఎస్ఐఐసీ స్థలాలు కేటాయిస్తున్నది. అభివృద్ధి చేసిన లేఔట్లలో నిర్ణీత ధరకు స్థలాలు కేటాయిస్తారు. టీఎస్ఐపాస్ ద్వారా సత్వరమే అనుమతులు మంజూరు చేస్తున్నారు. స్థలాన్ని పొందిన రెండేండ్లలో ఉత్పత్తి ప్రారంభించకపోతే కేటాయింపు రద్దవుతుంది. గత ఎనిమిదేండ్లలో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 56 కొత్త పారిశ్రామికవాడలను అభివృద్ధి చేశారు. ఇందులో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 22, గ్రామీణ ప్రాంతాల్లో 34 పారిశ్రామికవాడలు ఉన్నాయి.
ప్రత్యేక ఆహారశుద్ధి మండళ్లలో సైతం స్థలాల కేటాయింపు ప్రక్రియను టీఎస్ఐఐసీ చేపట్టింది. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో మేడ్చల్-మల్కాజిగిరి, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ సహా 15 జిల్లాల్లో కేటాయింపు ప్రక్రియను ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం అసిఫాబాద్ తదితర జిల్లాలు మినహా మిగిలినచోట్ల భూసేకరణ చేపట్టినట్టు వివరించారు. ప్రత్యేక ఆహారశుద్ధి మండళ్లలో మాత్రం గతంలో దరఖాస్తు చేసుకొని రూ.10 లక్షలు చెల్లించినవారికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆహారశుద్ధి మండళ్లలో పరిశ్రమల ఏర్పాటునకు 1,496 మంది ముందుకొచ్చారు.
గతంలో పారిశ్రామిక ప్రగతి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమైంది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల్లో కూడా పారిశ్రామికవాడల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నది. పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం తదితర ద్వితీయశ్రేణి నగరాల్లో పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారు. జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, నిర్మల్, వరంగల్, నాగర్కర్నూల్, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రిభువనగిరి తదితర ప్రాంతాల్లో కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటునకు టీఎస్ఐఐసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.