వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్) వ్యూహాత్మక విక్రయం కోసం లావాదేవీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్కాంత పాండే తెలిపారు. శుక్రవారం జరిగిన సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సదస్సులో మాట్లాడుతూ.. ఆర్ఐఎన్ఎల్ను అమ్మేందుకు అంతా సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
వైజాగ్ స్టీల్ అమ్మకాన్ని ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో సెయిల్లో ఆర్ఐఎన్ఎల్ను విక్రయానికి బదులుగా విలీనం చేయాలని కూడా ప్రతిపాదించారు. అయితే కొత్త ప్రభుత్వ రంగ సంస్థల విధానం పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని తిరస్కరించింది.