న్యూఢిల్లీ, జూలై 13: భారత్ కరెన్సీ రూపాయి, ఇతర ప్రధాన కరెన్సీల తరహాలోనే యూరోపియన్ జోన్ సింగిల్ కరెన్సీ యూరో ఈ ఏడాది నిలువునా పతనమై బుధవారం డాలర్తో సమానమయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో యూరో విలువ 1 స్థాయికి క్షీణించింది. ఈ రెండు కరెన్సీలు ఒకే అంకెకు చేరడం 20 ఏండ్లలో ఇదే ప్రధమం. ఈ ఏడాది ప్రారంభంలో డాలర్ మారకంలో 0.89 సమీపంలో ఉన్న యూరో విలువ ఇప్పటికే 12 శాతం పతనమయ్యింది.
ఉక్రెయిన్లో యుద్ధం, ఇంధన సంక్షోభం, యూరప్కు గ్యాస్ ఎగుమతుల్ని రష్యా నిలిపివేయడం తదితర కారణాలు యూరోను ముంచేశాయి. కేంద్ర బ్యాంక్లు వడ్డీ రేట్ల పెంపును వేగవంతం చేస్తున్న నేపథ్యంలో డాలర్ నిధులు యూరప్ నుంచి అమెరికాకు తరలివెళుతున్నందున, డాలర్ బలోపేతమై, యూరో క్షీణిస్తున్నదని విశ్లేషకులు చెప్పారు. తాజాగా అమెరికాలో జూన్ నెల వినియోగ ద్రవ్యోల్బణం 41 సంవత్సరాల గరిష్ఠస్థాయి 9.1 శాతానికి చేరిందన్న వార్తలతో ఫెడ్ వడ్డీ రేటు భారీగా పెంచుతున్నదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో యూరో మరింతగా క్షీణించింది. యూరో జోన్లో కూడా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం 9 శాతం స్థాయి సమీపంలో ఉంది. తమ కరెన్సీ విలువ అధికంగా ఉన్నందున ఎగుమతుల మార్కెట్లో పోటీతత్వం కొరవడుతుందంటూ రెండేండ్ల క్రితం ఆందోళన వ్యక్తం చేసిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ఇప్పుడు నాటకీయంగా కరెన్సీ పతనంతో ఉత్పత్తుల ధరల పెరుగుదలను ఎదుర్కొంటున్నది.
రూపాయి పతనం కొనసాగుతున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరో 22 పైసలు కోల్పోయి రికార్డు స్థాయి 79.81కి పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ 20 ఏండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఆటుపోటులకు గురవుతున్నాయి. మరోవైపు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను ఉపసంహరించుకోవడం కూడా రూపాయి పతనానికి ఆజ్యం పోశాయి. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో పలు దేశాల సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచనున్న భయాలు ఫారెక్స్ మార్కెట్పై స్పష్టంగా కనిపించాయి. క్రూడాయిల్ ధర 100 డాలర్ల దిగువకు పడిపోయినప్పటికీ రూపాయి పతనాన్ని నిరోధించలేకపోయింది. 79.55 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఒక దశలో 79.53 గరిష్ఠ స్థాయిని తాకింది.