న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) సభ్యులకు వారి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 2021-22 సంవత్సరానికి చెల్లించాల్సిన వడ్డీ రేట్లపై బుధవారం ఫిబ్రవరి 9న కీలక సమావేశం జరగనుంది. సంస్థకు చెందిన ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్, ఆడిట్ కమిటీ సమావేశమై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ ఈపీఎఫ్వో పెట్టుబడులపై ఆర్జించిన రాబడుల్ని చర్చిస్తుంది.అటుతర్వాత కమిటీలోని అధికారులు జరిపిన చర్చల ఆధారంగా పీఎఫ్ వడ్డీ రేటును ఈపీఎఫ్వో ట్రస్టీల బోర్డుకు సిఫార్సుచేస్తారు.
మార్చిలో ట్రస్టీల భేటీ
పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఖరారు చేసేందుకు మార్చి తొలివారంలో సంస్థ ట్రస్టీల బోర్డు భేటీ అవుతుంది. ఆడిటీ కమిటీ సిఫార్సును సైతం ట్రస్టీలు పరిశీలించి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ సిఫార్సును ట్రస్టీల బోర్డు సమావేశమయ్యే తేదీన గానీ, లేదా ఒక రోజు ముందుగానీ ఆడిట్ కమిటీ అందచేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటును జమచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికీ అదే రేటును కొనసాగించవచ్చన్న అంచనాలు విశ్లేషకుల్లో ఉన్నాయి.