Social Security Schemes | దేశ పౌరులందరికి ఇన్సూరెన్స్ కల్పించాలన్న లక్ష్యంతో ప్రజల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం రెండు బీమా పథకాలు తీసుకొచ్చింది. అందులో ఒకటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు తీసుకొచ్చింది. ఈ పథకాల్లో చేరిన పౌరులంతా ప్రీమియం చెల్లించాల్సిన తరుణం వచ్చేసింది. బ్యాంకుల్లోని పౌరుల సేవింగ్స్ ఖాతా నుంచి ఈ రెండు బీమా పథకాల ప్రీమియం ఆటో డెబిట్ అవుతాయి. ఇప్పటికే వివిధ బ్యాంకులు ఈ నెల 31వ తేదీలోగా ఎప్పుడైనా ప్రీమియం వసూలు చేస్తామని ఖాతాదారులకు బ్యాంకులు ఎస్ఎంఎస్లు పంపించాయి. తక్కువ ఆదాయ వర్గాలకు ఈ బీమా పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్కు ఈ పాలసీలు తీసుకునే వీలు ఉన్నది.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం (పీఎంఎస్బీవై).. ఇది కేంద్రం తెచ్చిన వ్యక్తిగత ప్రమాద బీమా తరహా పాలసీ.. ఒకవేళ ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగ వైకల్యానికి గురైనా రూ.2 లక్షల నష్ట పరిహారం చెల్లించేలా ఈ పథకం రూపొందించారు. ఈ పథకంలో చేరిన వారు రూ.20 ప్రీమియం చెల్లిస్తే సరి. 18-70 ఏండ్ల మధ్య వయస్సు గల వారందరూ ఈ పాలసీ లో చేరడానికి అర్హులే.
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం (పీఎంజేజేబీవై) కేంద్రం తీసుకొచ్చింది. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. 18-50 ఏండ్ల మధ్య వయస్సు గల వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఏడాది ప్రీమియం రూ.436 చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీకి రూ.2 లక్షల పరిహారం అందిస్తారు. పాలసీదారుడి వయస్సు 50 ఏండ్లు దాటిన తర్వాత మరో ఐదేండ్లు ప్రీమియం పొడిగించుకోవచ్చు.