Elon Musk | టెస్లా సీఈవో ఎలన్మస్క్ గురువారం ట్విట్టర్ ఉద్యోగులతో మాట్లాడనున్నారని తెలుస్తోంది. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ను టేకోవర్ చేస్తానని ఏప్రిల్లో ఎలన్మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 9.30 గంటలకు ట్విట్టర్ ఉద్యోగులందరితోనూ ఆయన మాట్లాడతారని సమాచారం. నేరుగా ట్విట్టర్ ఉద్యోగుల నుంచి సమాధానాలు తెలుసుకుంటారని వార్తలొచ్చాయి.
ట్విట్టర్ ఉద్యోగులతో ఎలన్మస్క్ భేటీ విషయాన్ని ఆ సంస్థ అధికార ప్రతినిధి ధృవీకరించారు. ఈ వారంలో కంపెనీ ఉద్యోగులందరితోనూ ఎలన్మస్క్ సమావేశం కావచ్చునని తెలిపారు. ఎలన్మస్క్ తమ సంస్థను టేకోవర్ చేస్తామని ప్రకటించినప్పటి నుంచి ట్విట్టర్ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది.
మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా వెబ్సైట్ ట్విట్టర్ బిజినెస్ను అస్థిర పరుస్తారని, ఆర్థికంగా దెబ్బ తింటుందని ట్విట్టర్ ఉద్యోగులు భయపడుతున్నారు. ట్విట్టర్లో స్పామ్ ఖాతాల వివరాలను వెల్లడించకపోతే దాని టేకోవర్ డీల్ నుంచి వైదొలుగుతానని గతవారం హెచ్చరించారు కూడా.
ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు ఎలన్మస్క్.. ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, తమ సంస్థ ఉద్యోగులు వారానికి కనీసం 40 గంటలు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుందన్నారు. దాదాపుగా వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికినట్లే.