న్యూఢిల్లీ, జూన్ 17: ట్విట్టర్ ఉద్యోగుల్లో కొందర్ని తొలగించకతప్పదని ఆ సంస్థ టేకోవర్కు బిడ్ చేసిన ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ సంకేతాలిచ్చారు. శుక్రవారం ట్విట్టర్ సిబ్బందితో ఒక వర్చువల్ సమావేశంలో మస్క్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నేరుగా వేసిన పలు ప్రశ్నలకు మస్క్ బదులిచ్చారు. లేఆఫ్స్ ఉంటాయా అన్న ప్రశ్నకు స్పందిస్తూ కంపెనీ ఆరోగ్యకరంగా వృద్ధి చెందడానికి అది అవసరమేనన్నారు. అయితే గణనీయమైన సేవలందిస్తున్నవారు ఆందోళన చెందాల్సింది ఏమీ లేదన్నారు. పనితీరు ఆధారంగా లేఆఫ్స్ ఉంటాయన్నారు. వర్క్ ఫ్రం హోంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ దీనిని చాలామంది కోరుకుంటున్నారని, అద్భుతంగా పనిచేసేవారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందన్నారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు మస్క్ బిడ్ చేసిన సంగతి తెలిసిందే.
100 కోట్ల యూజర్లు లక్ష్యం
ట్విట్టర్ ప్లాట్ఫామ్పైకి ఒక బిలియన్ (100 కోట్లు) యూజర్లను తీసుకురావడం తన లక్ష్యమని మస్క్ చెప్పారు. ప్రస్తుతం 22.9 కోట్ల మంది యూజర్లున్నారు. తాను వాక్స్వాతంత్య్రానికి ప్రాధాన్యతనిస్తానని, ఈ ప్లాట్ఫామ్పై చట్టానికి లోబడి ప్రజలు ఏ విషయంపైనైనా చెప్పుకునేందుకు అనుమతించాలంటూ ఉద్యోగుల్ని మస్క్ కోరారు. మారుపేర్లతో ఉన్న ఖాతాల ద్వారా ట్వీట్ చేయడం తప్పేమీ కాదని, స్వేచ్ఛగా రాజకీయ అభిప్రాయాలు విన్పించాలంటే అది తప్పదని అన్నారు. నకిలీ ఖాతాల సంఖ్య నిగ్గుతేలేంతవరకూ ట్విట్టర్ టేకోవర్ను నిలుపుచేస్తున్నట్టు ఇటీవల మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అటువంటి ఖాతాలకు ఇప్పుడు అనుకూలంగానే స్పందించినందున, ఉద్యోగులతో భేటీ జరిపినందున ట్విట్టర్ టేకోవర్కు మార్గం సుగమమైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.