న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: భారత్ మొబిలిటీ ఎక్స్పో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ఎక్స్పోలో పలు ఆటోమొబైల్ సంస్థలు తమ మాడళ్లను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..2014 కంటే ముందు పదేండ్లలో 12 కోట్ల వాహనాలు అమ్ముడవగా, 2014 నుంచి ఇప్పటి వరకు 21 కోట్ల వాహనాలు దేశీయంగా అమ్ముడయ్యాయన్నారు. అలాగే పదేండ్ల క్రితం కేవలం 2 వేల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవగా, ప్రస్తుతం ఈ సంఖ్య 12 లక్షల యూనిట్లకు చేరుకున్నాయన్న ఆయన..ప్యాసింజర్ వాహనాలు కూడా టాప్గేర్లో దూసుకుపోతున్నాయని చెప్పారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, బెంజ్, బీఎండబ్ల్యూలు పలు రకాల ఫ్యూయల్ టెక్నాలజీస్, సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాయి.