Maruti Suzuki | ఎలక్ట్రిక్ వాహనాల వాడకంతో ఆశించిన ప్రయోజనాలు ఇప్పట్లో నెరవేరబోవని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తేల్చేశారు. భారత్ మాదిరిగానే అమెరికా, యూరప్ దేశాలు విద్యుద్చక్తి తయారీకి బొగ్గుపైనే ఆధార పడుతున్నాయని గుర్తు చేశారు. కనుక కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా విద్యుత్ కార్లను తీసుకొచ్చినా వచ్చే 10-15 ఏండ్ల వరకు ఆ లక్ష్యాలను చేరుకోలేన్నారు.
బొగ్గు ఆధారిత విద్యుత్కు ప్రత్యామ్నాయంగా కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ), బయో-సీఎన్జీ, హైబ్రీడ్ వెహికల్స్ను తప్పనిసరిగా ప్రోత్సహించాల్సిందేనని ఈవీ కాంక్లెవ్ 2022 వద్ద ఆర్సీ భార్గవ చెప్పారు. సీఎన్జీ, బయో సీఎన్జీ, ఇథనాల్ తదితర ఇంధనాలతో నడిచే కార్లు తక్కువ గ్రీన్ హౌస్ వాయువులను వదులుతాయన్నారు. దీంతోపాటు ముడి చమురు దిగుమతి బిల్లు కూడా తగ్గడానికి సాయ పడుతుందని పేర్కొన్నారు.
భారీ కాలుష్యానికి కారణమైన పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్జీ పవర్డ్ కార్లపై విధించే పన్నును హేతుబద్ధీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్సీ భార్గవ సూచించారు. భారత్లో వాహనాలపై అత్యధికంగా 28 శాతం పన్నుతోపాటు అదనంగా సెస్ వసూలు చేస్తున్నారు. విద్యుత్ వాహనాలపై ఐదు శాతం జీఎస్టీ వడ్డిస్తున్నది కేంద్రం. సుదీర్ఘ కాలంగా సీఎన్జీ, హైబ్రీడ్ కార్లను మారుతి సుజుకి ప్రోత్సహిస్తున్నది. 2025లోపు విద్యుత్ కార్లను ఆవిష్కరించే ప్లాన్లేమీ మారుతి సుజుకి వద్ద లేవు.