హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ఒకవైపు ఈవీ బ్యాటరీల్లో మంటలు వ్యాపించి ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ వాటి అమ్మకాలు మాత్రం రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం లో సుమారు 46 వేల వాహనాలు రోడ్లపై దూసుకుపోతున్నాయి. గడిచిన రెండున్నరేండ్లలోనే సుమారు 36 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. త్వరలోనే ఈ సంఖ్య 50 వేలకు చేరుకోనున్నదని వాహనరంగ నిపుణులు అంచనావేస్తున్నారు.
ముఖ్యం గా పెట్రో ధరల పెరుగుదలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈవీ పాలసీతో కొనుగోలుదారులు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ఈవీల్లో అత్యధికంగా ద్విచక్రవాహనాలు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో కార్లు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 8,000 ఈ-కార్లు ఉండగా, త్వరలోనే వీటి సంఖ్య 10,000 దాటుతుందని అంచనా. దీనికి తగ్గట్టుగానే టీఎస్ రెడ్కో సైతం బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 150 చార్జింగ్ కేంద్రాలు ఉండగా, ప్రతినెలా నాలుగైదు కొత్త చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని రెడ్కో లక్ష్యంగా పెట్టుకున్నది.
దేశవ్యాప్తంగా డిమాండ్..
ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్ ధరలతో వాహన వినియోగదారుల ఆలోచనలు సైతం మార్పు అనివార్యంగా మారింది. సంప్రదాయ ఇంధన వాహనాలతో పోల్చుకుంటే ఈవీల ధర కొంత ఎక్కువే అయినప్పటికీ నిర్వహణ ఖర్చులనుంచి విముక్తి కలుగుతుందనే ఉద్దేశంతో ఈవీలవైపు దృష్టి సారిస్తున్నారు. 2022-23 లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 173 శాతం విక్రయాలు పెరిగినట్లు జేఎంకే రీసర్చ్ సంస్థ తెలిపింది. 2018-19లో దేశంలో 1,50,000 ఈవీలు రిజిస్ట్రర్ కాగా, 2021-22 నాటికి 4,60,000 లకు పెరిగినట్లు వారు వెల్లడించారు.
రాష్ట్రంలో ఈవీల వివరాలు..
రాష్ట్ర ఈవీ పాలసీ ముఖ్యాంశాలు..