న్యూఢిల్లీ, డిసెంబర్ 16: వ్యాపార కన్సల్టెన్సీ సంస్థ ఐస్నెరాంపర్ వచ్చే ఏడాదికల్లా రూ.6,000 కోట్ల (725 మిలియన్ డాలర్లు) రెవిన్యూను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అమెరికాలో విలీనాలు-కొనుగోళ్లు, భారత్లో ప్రతిభ-సాంకేతికతల్లో భారీ పెట్టుబడుల ద్వారా ఈ టార్గెట్ను సాధించాలని చూస్తున్నది. కాగా, 2020లో 411 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఈ కంపెనీ చేరుకున్నది.
ఐస్నెర్ అడ్వైజరీ గ్రూప్ ఎల్ఎల్సీకి చెందిన ఈ సంస్థకు దేశంలో హైదరాబాద్, ముంబై, బెంగళూరుల్లో కార్యాలయాలున్నాయి. వీటిలో 650 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఏడాది, ఏడాదిన్నర కాలంలో ఉద్యోగుల సంఖ్యను వెయ్యికిపైగా చేర్చాలని భావిస్తున్నట్టు ఐస్నెరాంపర్ తెలియజేసింది. దీంతో హైదరాబాద్సహా ఆయా నగరాల్లో కొత్తగా 400 ఉద్యోగాలు రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 300లకుపైగా భాగస్వాములున్న ఈ కంపెనీలో 3,200 మంది ఉద్యోగులున్నారు.