న్యూఢిల్లీ, ఆగస్టు 1: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ కాంత్ ముంజల్, మరికొందరికి చెందిన ఇండ్లు, కార్యాలయాల్లో ఈడీ మంగళవారం సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నమోదైన కేసులో ఢిల్లీ, గురుగ్రామ్ల్లోని ముంజల్ నివాస, వ్యాపార సముదాయాలు, ఆఫీసుల్లో దాడులు జరిగినట్టు ఈడీ అధికారులు తెలియజేశారు. దీన్ని హీరో మోటోకార్ప్ సైతం ధ్రువీకరించింది. ఈడీ దర్యాప్తునకు సహకరిస్తున్నట్టు తెలిపింది. కాగా సీబీఐసీ అనుబంధ దర్యాప్తు సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ పీఎంఎల్ఏ కేసును నమోదు చేసింది.
2018 ఆగస్టులో లండన్ వ్యాపార పర్యటన నేపథ్యంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) రూ.81 లక్షలకుపైగా విదేశీ కరెన్సీని సీజ్ చేసింది. దీంతో ప్రమేయమున్న ముంజల్, మరో ఉద్యోగిపై కస్టమ్స్ శాఖ కేసు పెట్టిన విషయం తెలిసిందే. నిరుడు మార్చిలోనూ పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా ముంజల్, హీరో మోటోకార్ప్లకు చెందిన నివాస, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగిన సంగతి విదితమే.