హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కువశాతం మంది బంగారం, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతున్నారని, ఇటువంటి వారు తమ పెట్టుబడులను స్టార్టప్స్కు మళ్లిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి సాధిస్తుందని సీఐఐ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ ఫర్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూవర్షిప్ అండ్ స్టార్టప్స్(సీఐఈఎస్) చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి పది వేల మంది వ్యక్తిగత సంపన్నుల పెట్టుబడులు 2025 నాటికి 700 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముందని, ఈ పెట్టుబడులను స్టార్టప్స్కు మళ్లించే విధంగా తగిన చర్యలు తీసుకుంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇకోసిస్టమ్కు ఎంతో దోహదం చేసినట్లు అవుతుందని ఆయన చెప్పారు. స్టార్టప్స్లో పెట్టుబడులు పెట్టాల్సిన ఆవశ్యకతపై సీఐఐ సీఐఈఎస్ నిర్వహించిన మాస్టర్ క్లాస్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో నిధుల రాబడికి విదేశీ పెట్టుబడులే ప్రధాన వనరుగా ఉందని, సొంతంగా వివిధ పెట్టుబడులు పెట్టేవారు కొంత మొత్తాన్ని స్టార్టప్స్కు మళ్లిస్తే దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపడేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.