రెండంకెల వృద్ధిరేటు ఉండకపోవచ్చు
మాజీ ఆర్థిక కార్యదర్శి ఎస్సీ గార్గ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: కరోనా వైరస్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ మరోసారి మందగించవచ్చని, రెండంకెల వృద్ధిరేటు ఉండకపోవచ్చని సోమవారం మాజీ ఆర్థిక కార్యదర్శి ఎస్సీ గార్గ్ అన్నారు. విజృంభిస్తున్న మహమ్మారిని అదుపులో పెట్టేందుకు ఆయా రాష్ర్టాలు లాక్డౌన్ల దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) జీడీపీ 10 శాతం దిగువనే ఉంటుందని అంచనా వేశారు. భారత జీడీపీని ఈసారికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) 12.5 శాతంగా, కేంద్ర ఆర్థిక సర్వే 11 శాతంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 10.5 శాతంగా అంచనా వేసిన విష యం తెలిసిందే. ఈ క్రమంలో గార్గ్ వ్యాఖ్య లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కీలకమైన రిటైల్, ఆతిథ్య, విద్య, రవాణా రంగాలపై ఆంక్షలు.. జీడీపీ వృద్ధిని అడ్డుకుంటున్నాయన్నారు.
తగ్గిన జీడీపీ అంచనా
దేశంలో కరోనా విలయం నేపథ్యంలో భారత జీడీపీ అంచనాలను ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ కుదించింది. ఈ ఏడాది వృద్ధిరేటు 10.2 శాతమేనన్నది. ఇంతకుముందు అంచనా 11.8 శాతంగా ఉండటం గమనార్హం. ఈ తగ్గింపునకు కారణాలుగా ఆరోగ్య సంక్షోభం, నెమ్మదించిన వ్యాక్సినేషన్, వైరస్ అదుపుపై లోపించిన ప్రభుత్వ వ్యూహాలను పేర్కొన్నది. మున్ముందు మరిన్ని కఠిన ఆంక్షలు వచ్చిపడితే దేశ జీడీపీ ఇంకా పడిపోవచ్చని హెచ్చరించింది. ఇదిలా ఉంటే నెల రోజుల జాతీయ లాక్డౌన్.. దేశ జీడీపీని 1-2 శాతం మేర మింగేస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా ఆర్థిక నిపుణులు ఇంద్రనీల్ సేన్ గుప్తా, ఆష్టా గుడ్వానీ అన్నారు. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ర్టాలు ఇప్పటికే పాక్షిక లాక్డౌన్లు, రాత్రి కర్ఫ్యూలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.