ముంబై, ఫిబ్రవరి 21: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం (క్యూ3)లో దేశ జీడీపీ 4.6 శాతంగా నమోదు కావచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతకుముందు త్రైమాసికాల్లో బాగున్న 30 రకాల సంకేతాలు.. ఇప్పుడు బాగాలేవని చెప్పడం గమనార్హం. అందుకే వృద్ధిరేటు అంచనాను ఈ స్థాయికే పరిమితం చేస్తున్నట్టు మంగళవారం తెలిపారు. కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు పేలవంగా ఉండటం, లాభాలు నిరుడుతో చూస్తే సగానికి పడిపోవడం కూడా వృద్ధి అంచనాలకు కోత పెడుతున్నాయని ఎస్బీఐ గ్రూప్ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ చెప్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన సుమారు 3వేల కంపెనీల ఆర్థిక ఫలితాల్లో ఒత్తిడి కనిపిస్తున్నట్టు వెల్లడించారు. పెరిగిన ఉత్పాదక వ్యయం వీటి లాభాలను హరిస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలోనే 2021-22 క్యూ3తో పోల్చితే 2022-23 క్యూ3లో లాభాలు 15.3 శాతం నుంచి 11.9 శాతానికి పడిపోయినట్టు వివరించారు. ఈ పరిణామం ఈసారి తయారీ రంగ వృద్ధిరేటుపైనా ప్రతికూల ప్రభావం చూపెట్టే వీలుందని హెచ్చరించారు. ఇక అంతర్జాతీయ ఆర్థిక మందగమనంతో పడిపోతున్న దేశీయ ఎగుమతులు కూడా భారత జీడీపీని దెబ్బతీస్తున్నాయని ఎస్బీఐ ముఖ్య ఆర్థికవేత్త సునీల్ కుమార్ సిన్హా అంటున్నారు.
మరోవైపు పారిశ్రామిక వృద్ధి నిరుత్సాహకరంగా ఉంటుందని అంచనా వేశారు. వినియోగ సామర్థ్యం ఆశాజనకంగా లేకపోవడమే కారణమన్నారు. ఇదిలావుంటే మొత్తం ఈ ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీ అంచనాను ఎస్బీఐ ఎకనామిస్టులు 7 శాతానికి పెంచారు. ఇంతకుముందు ఇది 6.8 శాతంగానే ఉన్నది. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యూ3 జీడీపీ అంచనా 4.4 శాతంగా ఉన్న విషయం తెలిసిందే.