IMF FDMD Gopinath | మొన్న మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ సీఈవోగా భారత సంతతి అమెరికన్ పరాగ్ అగర్వాల్ నియామకం.. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎఫ్డీఎండీ) గా మరో భారత సంతతి అమెరికన్ గీతా గోపీనాథ్కు పదోన్నతి. ఇంతకుముందు గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల తదితరులంతా భారత సంతతి వారే..
రోజురోజుకు అంతర్జాతీయ టెక్, ఎకనమిక్ సంస్థల్లో భారత సంతతి అమెరికన్ల ప్రతిభకు గుర్తింపు పెరుగుతున్నది. అందుకు నిదర్శనంగానే గీతా గోపీనాథ్ అందించిన సేవలకు గుర్తింపుగా పదోన్నతి పొందారు. మూడేండ్లుగా ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్గా సేవలందిస్తున్న గీతా గోపీనాథ్ తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లిపోవాలని తలపోశారు. కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో ఐఎంఎఫ్ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా జియోఫ్రీ ఒకామోటో రిటైర్ కానున్నట్లు ప్రకటించారు.
ఆ వెంటనే గీతా గోపీనాథ్ను ఎఫ్డీఎండీగా ప్రమోట్ చేస్తున్నట్లు క్రిస్టాలినా జార్జివా ప్రకటించారు. దీనికి కరోనా మహమ్మారి ప్రభావంతో అతలాకుతలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఐఎంఎంఫ్కు అసాధారణ సేవలందించారని క్రిస్టాలినా జార్జివా తెలిపారు. అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్న ప్రజల జీవితాలను గాడిలో పెట్టేందుకు, ఆర్థిక సంక్షోభం నుంచి గ్లోబల్ ఎకానమీని దారి మళ్లించేందుకు ఐఎంఎఫ్కు ఆమె మేథో సంపత్తి నాయకత్వం చేయూతనిచ్చిందని చెప్పారు.
కోవిడ్తో అల్లకల్లోలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడిలో పడలేదు. తమ సంస్థ చరిత్రలో సభ్య దేశాలతోపాటు ఐఎంఎఫ్లోనూ గౌరవం, ఆదరణ, అభిమానం సంపాదించుకున్న తొలి మహిళా ఆర్థికవేత్తగా గోపీనాథ్ నిలిచారు. విస్తృత శ్రేణి సమస్యలను కఠిన విశ్లేషణతో పరిష్కారానికి కృషి చేసి సంస్థను ముందుకు నడిపించడంతో అందరి ప్రశంసలు అందుకున్నారని జార్జివా చెప్పారు.
ఐఎంఎఫ్ ఎఫ్డీఎండీగా పని చేయడానికి గీతా గోపీనాథ్ అంగీకరించడం ఆనందంగా ఉందన్నారు. సభ్య దేశాల్లో ఐఎంఎఫ్ చేయూతతో సాగే పనులపై నిఘా, విధానాల రూపకల్పన, పరిశోధన, ప్రచురణల్లో అత్యున్నత ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు గీతా గోపీనాథ్. కాగా ఐఎంఎఫ్ ఎఫ్డీఎండీగా గీతా గోపీనాథ్ నియామకాన్ని అమెరికా స్వాగతించింది. వచ్చే ఏడాది ఆమె ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.