హైదరాబాద్, జూన్ 24: హైదరాబాదీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ అమెరికా సంస్థ ఈటాన్ ఫార్మాస్యూటికల్ నుంచి బ్రాండెడ్, జనరిక్ ఇంజెక్ట్బుల్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసింది. ఈ పోర్ట్ఫోలియో విలువ 50 మిలియన్ డాలర్లని (దాదాపు రూ.390 కోట్లు) రెడ్డీస్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఈ పోర్ట్ఫోలియోలో తొమ్మిది వేరువేరు కాంబినేషన్లతో కూడిన బయోర్ఫెన్ ఇంజెక్షన్, రెజిప్రెస్ ఇంజెక్షన్ ఎన్డీఏలు (న్యూ డ్రగ్ అప్లికేషన్లు), సిైస్టెన్ హైడ్రోక్లోరైడ్ అండా (అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్) ఉన్నాయి. వీటి కొనుగోలుకు తొలుత 5 మిలియన్ డాలర్ల నగదు చెల్లిస్తామని, మిగిలిన 45 మిలియన్ డాలర్ల వరకూ చెల్లింపు షరతులకు లోబడి ఉంటుందని రెడ్డీస్ తెలిపింది.
ఇండీవర్, అక్విస్టివ్ థెరప్యుటిక్స్తో ఒక పరిష్కార ఒప్పందంపై సంతకాలు చేసినట్టు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. దీంతో 2024 మార్చి 31కల్లా 72 మిలియన్ డాలర్లు (రూ.560 కోట్లకుపైగా) ఆ కంపెనీల నుంచి అందుతాయని తెలిపింది. తమ జనరిక్ బుప్రెనోర్ఫిన్, నలోక్సోన్ సబ్లింగ్వల్ వివిధ డోసేజీలకు సంబంధించి అన్ని క్లెయిమ్లూ ఈ సెటిల్మెంట్తో పరిష్కారం అయ్యాయని, ఇండీవర్, అక్విస్టివ్ల పేటెంట్ ఉల్లంఘన ఆరోపణలు, తమ యాంటీట్రస్ట్ కౌంటర్ క్లెయిమ్లు కూడా ఈ సెటిల్మెంట్లో భాగమని డాక్టర్ రెడ్డీస్ వివరించింది.