న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) లో తెలుగు రాష్ట్రాలు అదరగొడ్తున్నాయి. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2020 ర్యాంకింగ్స్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అగ్ర భాగాన నిలిచాయి. ఉన్నతంగా ఉన్న ఏడు రాష్ట్రాలను కేంద్రం ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తర్వాత గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. కేంద్రం మొత్తం 4 క్యాటగిరీల్లో రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్త విధానాలతో కేంద్రం ఈ ర్యాంకింగ్ ప్రక్రియను చేపట్టింది. 10,200 మంది పెట్టుబడిదారులు, వాటాదారుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించింది.
రెండో జాబితాలో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు 80-90 శాతం స్కోర్తో ఉన్నాయి. అలాగే అసోం, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు 50 నుంచి 80 శాతం స్కోరుతో మూడో జాబితాలో ఉన్నాయి. ఢిల్లీ, బీహార్, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు 50 శాతం కంటే తక్కువ స్కోర్ చేశాయి. 2015 నుంచి కేంద్రం ఈ ర్యాంకింగ్స్ ప్రకటిస్తూనే ఉన్నది. ఈ ర్యాంకింగ్స్ను ప్రతి ఏటా ప్రకటిస్తుండగా.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత ఏడాది వాయిదా వేసినట్లు తెలుస్తున్నది.