ముంబై, మే 2: విదేశీ ఫండ్ల దన్నుతో వరుసగా ఎనిమిదో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు కొనుగోలు చేయడానికి మదుపరులు ఎగబడటం కూడా సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇంట్రాడేలో 374 పాయింట్లు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 242.27 పాయింట్లు పెరిగి 61,354.71 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్తోపాటు నిఫ్టీ కూడా లాభాల్లో ముగిసింది. నిఫ్టీ 82.65 పాయింట్లు అందుకొని 18,147.65 వద్ద నిలిచింది. కార్పొరేట్ల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించడం, దేశ ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతుండటంతో సూచీలు కదంతొక్కాయని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు కూడా దోహదం చేశాయి. టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, మారుతి, ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్, లార్సెన్అండ్టుబ్రో, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, మహీంద్రాఅండ్మహీంద్రా షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. కానీ, సన్ఫార్మా, అల్ట్రాటెక్ సిమెం ట్, టాటా మోటర్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, నెస్లెలు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే మెటల్ 1.66 శాతం, పవర్ 1.41 శాతం, యుటిలిటీ 1.35 శాతం, ఆయిల్అండ్గ్యాస్ 1.30 శాతం, ఐటీ 1.24 శాతం, ఎనర్జీ 1.13 శాతం లాభపడగా..ఎఫ్ఎంసీజీ, టెలికమ్యూనికేషన్స్ షేర్లు నష్టపోయాయి.
రూపాయి 6 పైసలు డౌన్
రూపాయి పతనం కొనసాగుతున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మంగళవారం 6 పైసలు తగ్గి 81.88 వద్దకు జారుకున్నది. అమెరికా ఫెడ్ సమావేశంపై పెట్టుబడిదారులు వేచిచూసే దోరణి ఉండటంతో ఇతర కరెన్సీలు ఒత్తిడికి గురయ్యాయి. ఒక దశలో 81.72 గరిష్ఠ స్థాయిని తాకిన విలువ 81.95 కనిష్ఠానికి పడిపోయింది.