న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: పండుగ సీజన్ కావడంతో ప్రధాన ఈ-కామర్స్ సంస్థలన్నీ ఆన్లైన్ సేల్స్కు తెరతీశాయి. కస్టమర్లను భారీ ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. దీంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదవుతున్నాయి. దుస్తులు, మొబైల్స్, పాదరక్షలు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రోవేవ్ అవెన్లు, మిక్సర్-గ్రైండర్లు, కుక్కర్లు తదితర గృహోపకరణాలు, ఇతర సౌందర్య సాధనాలు, ఉత్పత్తులన్నీ ఒకేచోట లభిస్తున్నాయి మరి. పైగా ఎటూ కదలకుండా ఉన్నచోటి నుంచే కొనే సౌకర్యం ఉండటంతో ఈ-కామర్స్ కంపెనీల సేల్స్కు విశేష ఆదరణ వస్తున్నది. ముఖ్యంగా మొబైల్ ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆన్లైన్ బుకింగ్స్.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాయి. దీంతో ఆన్లైన్ పండగ షాపింగ్ వందలు, వేల కోట్లను దాటి లక్షల కోట్ల రూపాయల్లోకే చేరింది.
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కస్టమర్లు నిరుడుతో పోల్చితే రెండింతలు పెరిగారని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా శనివారం తెలియజేసింది. శుక్రవారం నుంచి అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ మొదలవగా, ఇప్పటిదాకా వచ్చిన ఆర్డర్ల ప్రకారం ఇందులో 75 శాతం కస్టమర్లు దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు చెందినవారేనని తెలిపింది. తొలి 36 గంటల్లో టైర్-2, 3 సిటీల నుంచి విశేష ఆదరణ లభించిందని పేర్కొన్నది. తమ వేదిక ద్వారా చిన్న, మధ్యతరహా వ్యాపారులు, స్టార్టప్లు 10 లక్షల ఉత్పత్తులను అమ్ముతున్నట్టు అమెజాన్ ఈ సందర్భంగా వెల్లడించింది. ఇక బుక్ చేసుకున్న గంటల వ్యవధిలోనే చాలా పట్టణాల్లో డెలివరీలను ఇస్తున్నామని, ఈసారి ఈ సౌకర్యాన్ని వరంగల్, నెల్లూరు, అనంతపూర్ తదితర ప్రాంతాల్లోనూ అందిస్తున్నామని అమెజాన్ ప్రకటించింది.
ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్.. ఈ పండుగ సీజన్ అమ్మకాల తొలిరోజు సెకనుకు 16 లక్షల యూజర్లను చూసినట్టు వెల్లడించింది. అయితే పూర్తి సేల్స్ వివరాలను మాత్రం సంస్థ తెలియపర్చలేదు. ‘ది బిగ్ బిలియన్ డేస్’ పేరిట ఫ్లిప్కార్ట్ వార్షిక పండుగ అమ్మకాలకు శ్రీకారం చుట్టగా, కస్టమర్ల నుంచి ఆకర్షణీయ స్థాయిలో ఆదరణ ఉందని పేర్కొన్నది. కాగా, మొబైల్స్, లార్జ్ అప్లియెన్సెస్, ఫ్యాషన్, ఫర్నీచర్, గృహోపకరణాలకు డిమాండ్ భారీగా ఉందని వివరించింది. ఈజీ ఈఎంఐలు, నో-కాస్ట్ ఈఎంఐలతోపాటు ఆయా డెబిట్/క్రెడిట్ కార్డులతో షాపింగ్పై డిస్కౌంట్లను ఈ-కామర్స్ సంస్థలు ప్రధానంగా అందిస్తున్నాయి.
ఫెస్టివ్ సీజన్లో భాగంగా తొలిరోజే పెద్ద ఎత్తున ఆర్డర్లను అందుకోగలిగామని మీషో శనివారం తెలియజేసింది. శుక్రవారం దాదాపు 87.6 లక్షల ఆర్డర్లు బుక్ అయినట్టు వివరించింది. ఐదు రోజులపాటు సాగనున్న ఈ షాపింగ్ సీజన్.. మంగళవారంతో ముగియనున్నది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతోపాటు గ్రామాల నుంచీ డిమాండ్ వ్యక్తమవుతున్నదని, దాదాపు 85 శాతం ఆర్డర్లు ఇక్కడి నుంచే వచ్చాయని మీషో ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గతంతో పోల్చితే సుమారు 80 శాతం వ్యాపారం పెరిగిందన్నది. ఫ్యాషన్, బ్యూటీ-పర్సనల్ కేర్, హోమ్-కిచెన్వేర్, ఎలక్ట్రానిక్ యాక్ససరీస్ అమ్మకాలు బాగా జరుగుతున్నట్టు చెప్పింది. చీరలు, డ్రెస్సులు, వాచీలు, నగలకూ గిరాకీ ఉన్నట్టు పేర్కొన్నది.