Durables Price Hike | కొత్త సంవత్సరం.. పండుగల వేళ ఇంట్లో అవసరాలకు కొత్త వస్తువు.. గృహోపకరణాలు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ తపన పడుతుంటారు. కానీ, ముడి సరుకు ధరలు పెరిగిపోవడం.. రవాణా చార్జీలు ఎక్కువ కావడంతో గృహోపకరణాల ధరలు పెరుగనున్నాయి. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, కన్జూమర్ డ్యూరబుల్స్ ధరలు 10 శాతం వరకు పెంచక తప్పదని ఆయా కంపెనీల యాజమాన్యాలు సంకేతాలిచ్చాయి. ఈ నెలాఖరులోగా గానీ, మార్చిలో గానీ వాషింగ్ మిషన్ల ధరలు 5-10 శాతం పెరుగుతాయి. ఇప్పటికే పనాసోనిక్, ఎల్జీ, హయ్యర్తోపాటు పలు సంస్థలు ఆయా వస్తువుల ధరలు ఎంత పెంచాలో నిర్ణయానికి వచ్చాయి. మార్చిలోపు ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని సోనీ, హిటాచీ, గోద్రేజ్సంస్థలు సంకేతాలిచ్చాయి.
మార్చిలోపు అన్ని రకాల కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లియెన్స్ ధరలు 5-7 శాతం పెరుగుతాయని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) పేర్కొంది. కమొడిటీల ధరలు, గ్లోబల్ రవాణా, ముడి సరుకు ధరలు అసాధారణ స్థాయిలో పెరిగాయని హయ్యర్ అప్లియన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీశ్ ఎన్ఎస్ పీటీఐకి తెలిపారు. దీంతో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషనర్ల ధరలు 3-5 శాతం పెరుగుతాయన్నారు.
ఇక పనాసోనిక్ ఇప్పటికే ఏసీలపై 8 శాతం ధరలు పెంచేసింది. మరోమారు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నది. మిగతా హోం అప్లియెన్సెస్ ధరలను పెంచాలని యోచిస్తున్నది. సప్లయ్ చైన్, పెరిగే వ్యయాన్ని బట్టి మరో దఫా ధరలు పెంచొచ్చని పనాసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియసు పుజిమొరి తెలిపారు.
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ కన్జూమర్ మేజర్ ఇప్పటికే హోం అప్లియెన్సెస్ ధరలు పెంచేసింది. నిరంతరం ముడి సరుకు ధరలు, లాజిస్టిక్స్ ధరలు పెరగడం ఆందోళనకరం అని పేర్కొన్నది. తాము ధరల భారం తగ్గింపునకు ఇన్నోవేషన్ చర్యలు తీసుకుంటున్నా.. సుస్థిర బిజినెస్ కోసం ధరలు పెంచక తప్పడం లేదని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ చెప్పారు.
హోం అప్లియెన్సెస్ ధరల పెంపు అనివార్యం అని జాన్సన్ ఆధ్వర్యంలోని హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా సీఎండీ గుర్మీత్సింగ్ చెప్పారు. ముడిసరుకు ధరలు, పన్నులు, రవాణా ఖర్చులు పెరగడంతో అన్ని బ్రాండ్ల ధరలు దశల వారీగా ఏప్రిల్ వరకు 8-10 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. గతేడాది డిసెంబర్ వరకు 6-7 శాతం కన్జూమర్ డ్యూరబుల్స్ ధరలు పెరిగాయి. దీనికి తోడు అల్యూమినియం, రిఫ్రిజిరేటర్లపై యాంటీ డంపింగ్ డ్యూటీ వల్ల మరో 2-3 శాతం ధరలు పెరుగనున్నాయి.
సీఈఏఎంఏ అధ్యక్షుడు ఎరిక్ బ్రాగంజా మాట్లాడుతూ గత ఫెస్టివ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ధరల పెంపును వాయిదా వేశామన్నారు. ఇప్పుడు ధరలు పెంచక తప్పని సరిస్థితులు ఉన్నాయని స్పష్టం చేశారు. సోనీ, గోద్రేజ్ అప్లియెన్సెస్ ఇప్పటికైతే ధరల పెంపు అంశాన్ని టేకప్ చేయలేదని తెలిపారు. ప్రస్తుతానికి ధరల పెంపు చర్చలేదని సోనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నయ్యర్ చెప్పారు. ధరలు పెంచితే కరోనా నేపథ్యంలో డిమాండ్ పడిపోతుందని గోద్రేజ్ అప్లియెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది అన్నారు. కన్జూమర్ డ్యూరబుల్స్లో సెమీ కండక్టర్లతోపాటు మెటల్స్, ప్లాస్టిక్ వాడకంతో ఖర్చు ఎక్కువ అవుతుందన్నారు.