Donald Junior Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ ఈ నెలలో భారత్లో పర్యటించనున్నారు. భారత్లో తన వ్యాపారాలను విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం భారతదేశంలో ట్రంప్ టవర్ ఢిల్లీ-ఎన్సీఆర్, ట్రంప్ టవర్ కోల్కతా, ట్రంప్ టవర్ పుణె, ట్రంప్ టవర్ ముంబై అనే నాలుగు ట్రంప్ ప్రాజెక్ట్లు ఉన్నాయి. భారత్లో పంచశీల్ రియాల్టీతో కలిసి పుణెలో ట్రంప్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ఒక లగ్జరీ ప్రాజెక్ట్ను పూర్తి చేసింది. అలాగే, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబైలోని హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం 2014 లో లోధా గ్రూప్తో ఒప్పందం చేసుకున్నది.
ది ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా డొనాల్డ్ జూనియర్ ట్రంప్ ఉన్నారు. ఈ సంస్థ భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తన ప్రాజెక్టులను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. జూనియర్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టులను ప్రకటించవచ్చని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. న్యూయార్క్కు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ ముంబైకి చెందిన ట్రిబెకా డెవలపర్స్తో భాగస్వామ్యం ద్వారా భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించింది.
‘ట్రంప్’ బ్రాండ్ క్రింద లగ్జరీ ప్రాజెక్ట్లను నిర్మించడానికి జూనియర్ ట్రంప్ ఆధ్వర్యంలోని సంస్థ.. ట్రిబెకా డెవలపర్స్, లోధా గ్రూప్తో పాటు అనేక స్థానిక డెవలపర్లతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పటివరకు నాలుగు లగ్జరీ ప్రాజెక్ట్లు ప్రకటించారు. వీటిలో పుణెలో ఒకటి ఇప్పటికే పూర్తయింది. ట్రిబెకా డెవలపర్స్ 10 వ వార్షికోత్సవం సందర్భంగా జూనియర్ ట్రంప్ భారత్ వస్తున్నారని ట్రిబెకా డెవలపర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.