ముంబై, ఏప్రిల్ 10 : దేశీయ స్టాక్ మార్కె ట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్ షేర్లకు మదుపర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలు కదంతొక్కాయి. వారాంతపు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఒక్క శాతానికి పైగా బలపడ్డాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణుగుతుండటంతోపాటు క్రూడాయిల్ ధరలు దిగొస్తుండటం మార్కెట్లో సెంటిమెంట్ను ప్రోత్సహించిందని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 918.60 పాయింట్లు లేదా 1.20 శాతం అందుకొని 77,550.25 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 275.50 పాయింట్లు లేదా 1.16 శాతం అందుకొని 24,050.60 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పడుతుండటం మదుపర్లలో ఉత్సాహన్ని నింపిందని, అలాగే క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో అత్యధికంగా లాభం చేకూరే దేశాల్లో భారత్ ముందువరుసలో ఉండటం కూడా సూచీలు ర్యాలీకి దోహదపడిందని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.