ముంబై, జూన్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మునుపెన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్డు స్థాయిల్లో ముగిశాయి. ఉదయం ఆరంభం నుంచే లాభాల్లో మొదలైన సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ మరింతగా పెరుగుతూపోయాయి. ఈ క్రమంలోనే ఆల్టైమ్ హై సమీపానికి చేరాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 466.95 పాయింట్లు లేదా 0.74 శాతం ఎగిసి తొలిసారి 63,384.58 వద్ద నిలిచింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 1నాటి 63,284 రికార్డు ముగింపు కనుమరుగైపోయింది. ఒకానొక దశలో 602. 73 పాయింట్లు పెరగడంతో 63,520.36ను తాకింది. ఇంట్రా-డే రికార్డు 63,583.07గా ఉన్నది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 137.9 పాయింట్లు లేదా 0.74 శాతం ఎగబాకి మొదటిసారి 18,826 వద్ద స్థిరపడింది. ఫలితంగా గత రికార్డు ముగింపు 18,812 చెరిగిపోయింది. కాగా, ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 758.95 పాయింట్లు లేదా 1.21 శాతం, నిఫ్టీ 262.6 పాయింట్లు లేదా 1.41 శాతం పుంజుకున్నాయి. వరుసగా మూడు రోజులు లాభపడిన మార్కెట్లు.. గురువారం నష్టపోయాయి.
ప్రధాన రంగాల సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి. ఆర్థిక సేవలు 1.21 శాతం, బ్యాంకింగ్ 1.03 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.02 శాతం, ఇండస్ట్రియల్స్ 0.91 శాతం, ఎఫ్ఎంసీజీ 0.8 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 0.78 శాతం, కన్జ్యూమర్ డిస్క్రియెషనరీ 0.74 శాతం చొప్పున పుంజుకున్నాయి. అయితే ఐటీ, చమురు-గ్యాస్, రియల్టీ, టెక్నాలజీ షేర్లు నిరాశపర్చాయి. షేర్లవారీగా.. బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్యూఎల్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి.
స్టాక్ మార్కెట్ల రికార్డు లాభాల నేపథ్యంలో మదుపరుల సంపద కూడా భారీగానే పెరిగింది. బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ శుక్రవారం ఒక్కరోజే రూ.2 లక్షల కోట్లు ఎగబాకింది. దీంతో మార్కెట్ క్యాప్ లైఫ్టైమ్ హైని తాకుతూ రూ.292.78 లక్షల కోట్లకు చేరింది. నిరుడు డిసెంబర్ 14న బీఎస్ఈలోని కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి రూ.2,91,25,007.45 కోట్లను తాకింది. ఇప్పుడిది రూ.2,92,78,245.41 కోట్లుగా ఉన్నది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచకపోవడం, కొనసాగిన విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ మార్కెట్ల లాభాలు కలిసొచ్చాయని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.