ముంబై, జూన్ 9: డిజిటల్ లెండింగ్ యాప్ల కోసం త్వరలో ఓ రెగ్యులేటరీ నిర్మాణాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకురానున్నది. ఆన్లైన్లో అప్పులిస్తున్న యాప్లలో ప్రస్తుతం చాలావరకు అక్రమంగా, అవ్యవస్థీకృతంగానే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ యాప్ల ఏజెంట్ల వేధింపులకు పలువురు బలైపోయిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే డిజిటల్ లెండింగ్ వేదికల నియంత్రణకు త్వరలోనే మార్గదర్శకాలు తేనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
గురువారం ఇక్కడ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘డిజిటల్ యాప్ల ద్వారా రుణాలిస్తున్నవారితో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి వీలైనంత త్వరలోనే ఓ బోర్డు రెగ్యులేటరీ నిర్మాణాన్ని తీసుకురానున్నాం. ఈ యాప్లలో చాలావరకు అనధికారిక, గుర్తింపులేని, అక్రమ సంస్థలే’ అని భారతీయ వ్యాపారం (గతం, ప్రస్తుతం, భవిష్యత్తు)పై ప్రసంగిస్తూ అన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ) ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.