న్యూఢిల్లీ, నవంబర్ 19: జీవిత బీమా ఖరీదెక్కనున్నది. ప్రీమియంలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి. వచ్చే ఏడాది పెంపు ఉంటుందన్న సంకేతాలను బడా రీఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తున్నాయి. 20 శాతం నుంచి 40 శాతం మేర ప్రీమియం ధర పెరుగుతుందని చెప్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐకి ప్రీమియం చార్జీల పెంపునకు సంబంధించి విజ్ఞప్తులు పెట్టుకున్నాయి. పెంపును అనుమతించాలంటూ దరఖాస్తు చేసుకున్నాయి. ఇటు ఆన్లైన్, అటు ఆఫ్లైన్ పాలసీలపైనా ఈ ప్రభావం ఉండనున్నది.
డిజిటలైజేషన్ పెరుగుతున్నా.. బీమా కొనుగోలుదారులు మాత్రం ఇంకా పాలసీ డాక్యుమెంట్లను భౌతికంగా తీసుకునేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. 80 శాతానికిపైగా ఇన్సూరెన్స్ బయ్యర్లు ఇప్పటికీ తమ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఫిజికల్ కాపీనే అడుగుతున్నారని ఓ తాజా సర్వేలో తేలింది. బాంబే మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ (బీఎంపీఏ) నిర్వహించిన సర్వేలో 82 శాతం మంది ఇన్సూరెన్స్ కంపెనీతో చేసుకున్న బీమా పాలసీ ఒప్పందానికి సంబంధించిన పత్రాన్ని కోరుకుంటున్నారని స్పష్టమైంది. కాగా, చాలా సంస్థలు బీమా క్లయిమ్ సమయంలో ఇన్సూరెన్స్ ఒరిజినల్ పేపర్ డాక్యుమెంట్లనే అడుగుతున్నాయని, దీంతో బయ్యర్లు డిజిటల్ ఫామ్ కంటే ఫిజికల్ ఫామ్ ఉంటేనే మంచిదని భావిస్తున్నట్లు సర్వే చెప్పింది. మొత్తం 5,900 మందితో ఈ సర్వేను బీఎంపీఏ చేపట్టింది.
కరోనా వైరస్ దెబ్బకు బీమా రంగం కుదేలైంది. పెరిగిన క్లయిములు.. సంస్థలకు నష్టాల్ని తెచ్చిపెట్టాయి. మహమ్మారి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక పాలసీలను సామాన్యులకూ అందుబాటులో ఉంచాలని ఐఆర్డీఏఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే కేసులు పెరిగినాకొద్దీ.. క్లయిములూ పెరుగుతూపోవడంతో కంపెనీలకు నష్టాలు తప్పలేదు. దీంతోనే ప్రీమియం చార్జీలను పెంచాలన్న నిర్ణయానికి బీమా సంస్థలు వచ్చాయి. నిజానికి దాదాపు 6 నెలలుగా ప్రీమియం ధరలను పెంచాలనే బీమా కంపెనీలు చూస్తున్నాయి. అయితే ఇప్పుడు అనివార్యమైందని చెప్తున్నాయి. మరోవైపు కొన్ని దేశీయ సంస్థలు తమ గ్లోబల్ రీఇన్సూరర్లతో పెంపును తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నాయి.