న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరు కోసం ఏ ఒక్కరి నుంచి అదనంగా సింగిల్ పైసా కూడా వసూలు చేయడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలపై ఎటువంటి అదనపు పన్నులు విధించడం లేదని గురువారం కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక సదస్సులో చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రాలకు పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లిస్తామన్నారు.
కరోనా మహమ్మారిని నియంత్రించడానికి అదనంగా పన్ను చెల్లించాలని ఏ ఒక్కరిని తమ ప్రభుత్వం అడగడం లేదన్నారు. వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులను గానీ, పరిశ్రమలను గానీ అదనంగా పన్ను చెల్లించాలని అడగలేదని చెప్పారు.
పెట్రోల్, డీజిల్లపై పన్నులు, సెస్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా స్పందించలేదు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా ఇంధన రంగంలో స్వయం సమ్రుద్ధి సాధించకపోతే పెట్రోలియం ఉత్పత్తులకోసం భారీగా చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ద్రవ్యోల్బణం ఆరు శాతాన్ని దాటడానికి సీజనల్ అంశాలు కారణం అని చెప్పారు. కరోనా రెండు వేవ్లతో దేశీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని చెప్పారు. ప్రజలపై ప్రత్యక్ష పన్నుల భారం మోపుతున్నామనడం వాస్తవం కాదన్నారు.