DGGI Raids Crypto Exchanges | దేశంలోని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లు భారీగా మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ (డీజీజీఐ) అధికారులు వజీర్ ఎక్స్తోపాటు దేశంలోని కొన్ని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కంపెనీలపై దాడులు చేశాయి. ఈ దాడులకు సంబంధించి డీజీజీఐ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. భారీ మొత్తంలో పన్నుఎగవేతకు పాల్పడినందుకు వజీర్ఎక్స్పై రూ.49.20 కోట్ల మేర డీజీజీఐ జరిమానా విధించినట్లు సమాచారం.
క్రిప్టో కరెన్సీ వాలెట్లు, ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ భారీ మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తున్నది. ఈ క్రిప్టో కరెన్సీల్లో ట్రేడర్లు, మర్చంట్లు, సాధారణ వ్యక్తులు పెట్టుబడులు మదుపు చేశారు. అధికార వర్గాల కథనం ప్రకారం ఈ వాలెట్లు, ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ రూ.70 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డాయి. వజీర్ ఎక్స్తోపాటు కాయిన్ స్విచ్ కుబేర్, కాయిన్ డీసీఎక్స్, యూకాయిన్, యూనో కాయిన్ అనే ఎక్స్చేంజీల లావాదేవీలపై డీజీజీఐ దర్యాప్తు చేస్తున్నది.
క్రిప్టో కరెన్సీలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు అని.. వాటిని దేశంలో నిషేధించాలని గత నెలలో జరిగిన బ్యాంక్ బోర్డు సమావేశంలో ఆర్బీఐ వాదించింది. క్రిప్టో కరెన్సీల నియంత్రణకు ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం భావించినా.. సమయం సరిపోక అది వాయిదా పడినట్లు వినికిడి.