న్యూఢిల్లీ/ముంబై, ఏప్రిల్ 2: విస్తారాపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సీరియస్గా దృష్టి సారించింది. ఈ టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థ.. వరుసగా రెండోరోజూ విమాన సర్వీసులను రద్దు చేసింది. పైలట్లు అందుబాటులో లేకపోవడం కారణంగా చూపుతూ మంగళవారం ఏకంగా 50కిపైగా ఫ్లైట్లను క్యాన్సిల్ చేసింది.
ఈ క్రమంలో విమాన సర్వీసుల జాప్యం, రద్దుకు సంబంధించిన సమాచారం, ఇతరత్రా వివరాలపై రోజువారీ నివేదికను సమర్పించాలని విస్తారాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించింది. అలాగే విమానాల ఆలస్యం, రద్దు నేపథ్యంలో ప్రయాణీకులకు కావాల్సిన సౌకర్యాలను విస్తారా అందిస్తున్నదా? ప్యాసింజర్లు ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? అన్నదాన్నీ డీజీసీఏ పరిశీలిస్తున్నది.
మరోవైపు చాలామంది ప్రయాణీకులు సోషల్ మీడియాలో తాము ఎదుర్కొంటున్న అసౌకర్యంపై పోస్టులు పెడుతున్నారు. దీంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సైతం ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నది. అసలు ఏం జరుగుతున్నదన్నది ఆరా తీస్తున్నది. ఇటీవలే 15 మంది పైలట్లు విస్తారాకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇలా జరుగుతుండటం గమనార్హం. విస్తారాలో దాదాపు 800 మంది పైలట్లున్నారు.
వేసవి నేపథ్యంలో రోజూ 300లకుపైగా విమానాలను నడుపుతున్నది. ఇందులో 70కిపైగా ఏ320, బోయింగ్ 787 విమానాలున్నాయి. కాగా, ఎయిరిండియాలో విలీనం దిశగా అడుగులు వేస్తున్న విస్తారా.. ఉద్యోగులతో కొత్త ఒప్పందాలను చేసుకుంటున్నది. అయితే జీతాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని సహించక సీనియర్ ఆఫీసర్లు ముఖ్యంగా పైలట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పైలట్లు విధుల నుంచి తప్పుకుంటుండటంతో ఏ320 సర్వీసులు నిలిచిపోయాయి.